రైతులకు లబ్ధి చేకూర్చే... ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో తిరిగి చేరిన తెలంగాణ

Telangana joins PMFBY again
  • గతంలో 2016 నుంచి 2020 వరకు PMFBYలో కొనసాగిన తెలంగాణ
  • ఆ తర్వాత ఉపసంహరించుకున్న నాటి తెలంగాణ ప్రభుత్వం
  • సీఎం రేవంత్ రెడ్డితో నేడు కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి రితేశ్ చౌహాన్ సమావేశం
  • PMFBYతో రైతుల‌కు ప్ర‌యోజ‌నమేనని... పంట‌ న‌ష్ట‌పోయిన‌ప్పుడు స‌కాలంలోనే ప‌రిహారం అందుతుంద‌ని వెల్లడి
  • రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధిలో రైతు కేంద్రిత  విధానాల అమ‌లుకు ప్రాధాన్యం ఇస్తామ‌ని రేవంత్ రెడ్డి హామీ
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో తెలంగాణ మళ్లీ చేరింది. గతంలో 2016 నుంచి 2020 వరకు కొనసాగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే ఈ రోజు సాయంత్రం కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి రితేశ్ చౌహాన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై చర్చించారు. తిరిగి ఇందులో చేరాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే పంటకాలం నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణలో అమలు కానుంది.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలోకి (PMFBY) తెలంగాణ ప్ర‌భుత్వం తిరిగి చేర‌డంతో వ‌చ్చే పంట కాలం నుంచి రైతులు ఈ ప‌థ‌కం నుంచి పంట‌ల బీమా పొంద‌నున్నారు. PMFBYతో రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని, పంట‌లు న‌ష్ట‌పోయిన‌ప్పుడు స‌కాలంలోనే ప‌రిహారం అందుతుంద‌ని రితేష్ చౌహాన్ ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధిలో రైతు కేంద్రిత విధానాల అమ‌లుకు ప్రాధాన్యం ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.

రైతుల‌కు ద‌న్నుగా నిల‌వ‌డ‌మే ధ్యేయం: రేవంత్ రెడ్డి

రైతుల‌కు ద‌న్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బ‌లోపేతం చేయ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సాగు రంగంలోని ప్ర‌తికూల‌త‌లను త‌ట్టుకుంటూ రైతులకు ర‌క్ష‌ణగా నిలిచేందుకు PMFBYలో రాష్ట్ర ప్ర‌భుత్వం తిరిగి చేరినట్లు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి రితేశ్ చౌహాన్‌తో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. 
Advertisement
Revanth Reddy
Congress
BJP
Narendra Modi

More Telugu News