Bengaluru: బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుపై సీఎం సిద్ధరామయ్య స్పందన

  • కేఫ్ మీద దాడికి ఐఈడీని ఉపయోగించారన్న సీఎం 
  • మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని తెలిపిన సీఎం
  • పేలుడుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడి
9 Injured In Bomb Blast At Bengaluru Rameshwaram Cafe

బెంగళూరు కుండలహళ్లిలోని ప్రముఖ రెస్టారెంట్‌ 'రామేశ్వరం కేఫ్'లో ఈ రోజు జరిగిన బాంబు పేలుడులో తొమ్మిదిమంది గాయపడ్డారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలేకరుల సమావేశంలో తెలిపారు. పేలుడు విషయం తెలియగానే ఎన్ఐఏ, బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకున్నాయి. అనంతరం సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... కేఫ్ మీద దాడికి ఐఈడీని ఉపయోగించినట్లు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని సమాచారం ఉందన్నారు. అక్కడ ఒక బ్యాగ్‌ను గుర్తించినట్లు చెప్పారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

కేఫ్ యజమానితో మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య

పేలుడు ఘటనపై కేఫ్ యజమానితో మాట్లాడినట్లు బీజేపీ నేత, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఎక్స్ వేదికగా తెలిపారు. రామేశ్వరం కేఫ్ వ్యవస్థాపకుడు నాగరాజ్‌తో రెస్టారెంట్‌లో జరిగిన పేలుడు గురించి ఇప్పుడే మాట్లాడానని పేర్కొన్నారు. కస్టమర్ వదిలి పెట్టిన బ్యాగ్ వల్ల పేలుడు సంభవించిందని, సిలిండర్ పేలుడు ఏదీ జరగలేదని చెప్పారని తెలిపారు. ఈ ఘటనలో తమ ఉద్యోగి ఒకరు కూడా గాయపడినట్లు తనకు చెప్పారని వెల్లడించారు. ఈ బాంబు పేలుడుకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి స్పష్టమైన సమాధానం కోసం బెంగళూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు.

More Telugu News