KTR: అందుకోసమే 'చలో మేడిగడ్డ': కేటీఆర్ కవితాత్మక ట్వీట్

  • నేడు చలో మేడిగడ్డ యాత్రను చేపడుతున్న కేటీఆర్
  • కేటీఆర్ ఆధ్వర్యంలో కొనసాగనున్న యాత్ర
  • వచ్చే వరదల్లో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమన్న కేటీఆర్
KTR tweet on Chalo Medigadda

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పడు హాట్ టాపిక్ గా ఉంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే... బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 'చలో మేడిగడ్డ' కార్యక్రమాన్ని చేపడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. కాసేపట్లో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు పయనం కానున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మేడిగడ్డ యాత్ర ఎందుకో కేటీఆర్ కవితాత్మకంగా తెలియజేశారు 

కేటీఆర్ చేసిన ట్వీట్ యథాతథంగా:

"మళ్లీ తెలంగాణను 
ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టడానికే... ఈ “చలో మేడిగడ్డ” 

చిన్న లోపాన్ని.. 
పెద్ద భూతద్దంలో చూపిస్తూ.. 
బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని
బట్టబయలు చేసేందుకే...  ఈ “చలో మేడిగడ్డ” 

ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును పరిరక్షించకుండా.. 
కూలిపోవాలని చూస్తున్న కాంగ్రెస్ కుతంత్రాన్ని ప్రజల సాక్షిగా నిలదీయడానికే.. 
ఈ “చలో మేడిగడ్డ” 

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 
పండుగలా మారిన వ్యవసాయాన్ని 
మళ్లీ దండగలా మార్చే కాంగ్రెస్ పన్నాగాలకు పాతరేసేందుకు 
ఈ “ చలో మేడిగడ్డ ” 

పంజాబ్ నే తలదన్నే స్థాయికి ఎదిగిన
తెలంగాణ రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న
కాంగ్రెస్ నీచ సంస్కృతికి సమాధి కట్టేందుకే ఈ “చలో మేడిగడ్డ” 

మరమ్మత్తులు కూడా చేతకాని “గుంపుమేస్త్రీ”ని 
నమ్ముకుంటే తెలంగాణ రైతు నిండా మునుగుడే.. 
అని మరోసారి చాటిచెప్పేందుకే ఈ “చలో మేడిగడ్డ” 

దశాబ్దాలపాటు.. 
కాంగ్రెస్ చేసిన తప్పులను.. 
కాంగ్రెస్ పాలనలో సాగునీటి తిప్పలను.. 
అరవై ఏళ్లు కాంగ్రెస్ పెట్టిన అరిగోసను 
అన్నదాతలు మరువలేదని గుర్తుచేసేందుకే.. ఈ “చలో మేడిగడ్డ” 

మళ్లీ కన్నీటి సాగుకు 
తెలంగాణను కేరాఫ్ గా మారిస్తే సహించం..

మీ దుష్ట రాజకీయాల కోసం.. 
మా తెలంగాణ రైతాంగాన్ని బలిచేస్తే భరించం.. 

పోటీ యాత్రలు చేయడం కాదు.. 
ప్రజలు అప్పగించిన డ్యూటీ చేయండి..

మేడిగడ్డకు మరణశాసనం రాయాలని చూస్తే...
తెలంగాణ గడ్డపై.. కాంగ్రెస్ కే నూకలు చెల్లడం ఖాయం 
వచ్చే వరదల్లో.. కాంగ్రెస్ పార్టీయే కొట్టుకుపోవడం తథ్యం 
జై తెలంగాణ 
జై కాళేశ్వరం 
జై బీఆర్ఎస్" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

More Telugu News