Kadiam Srihari: మహిళల నాయకత్వంలో పనిచేస్తూ మగతనం అంటారా?: రేవంత్ రెడ్డిపై కడియం శ్రీహరి మండిపాటు

  • రాజకీయాలకు, మగతనానికి సంబంధం ఏమిటి? అని నిలదీత
  • ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుతున్న వారిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడి
  • కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయం కోసమే కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని ఆరోపణ
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారాన్ని తిప్పికొట్టడానికే మేడిగడ్డకు వెళుతున్నట్లు వెల్లడి
Kadiyam Srihari faults Revanth Reddy coments in Chevella meeting

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన భాషను మార్చుకుంటాడని భావించామని, కానీ రోజురోజుకూ సహనం కోల్పోతున్నాడని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాజకీయాలకు, మగతనానికి సంబంధం ఏమిటి? అని నిలదీశారు. సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ... ఈ ఇద్దరు మహిళల నాయకత్వంలో పనిచేస్తూ మగతనం గురించి మాట్లాడటం ఏమిటి? అని ప్రశ్నించారు. హన్మకొండలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చేవెళ్ల సభలో రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాషను కడియం శ్రీహరి తప్పుబట్టారు. ప్రజల తరఫున ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుతున్న వారిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాల్సిన ముఖ్యమంత్రి తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయం కోసమే కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని ఆరోపించారు. లోపాలు ఉంటే సరిచేసి రైతులకు నీళ్లు అందించాలని సూచించారు. అయినా ఈ ప్రాజెక్టు విషయంలో తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలని మేమే చెబుతున్నామని... ఇంకా రాజకీయం చేయడం ఎందుకో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పేరుకే జాతీయ పార్టీ కానీ అదో కుటుంబ పార్టీ అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రానికి సీఎం అనే విషయం గ్రహించి భాష మార్చుకోవాలని హితవు పలికారు.

కేసీఆర్ పదేళ్ల కాలంలో కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దారన్నారు. కేసీఆర్ తన పనితీరుతో కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థల మెప్పు పొందారని గుర్తు చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి సెగ్మెంట్‌లో కాంగ్రెస్ ఒక్క సీటును కూడా ఎందుకు గెలుచుకోలేకపోయింది? అని కడియం ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తోన్న విష ప్రచారాన్ని తిప్పికొట్టడానికే తాము మేడిగడ్డకు వెళుతున్నట్లు చెప్పారు.

More Telugu News