Vinod: చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు: బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్

  • మేడిగడ్డ 84 పిల్లర్లలో రెండు, మూడు మాత్రమే కుంగిపోయాయన్న వినోద్
  • పిల్లర్లకు రిపేర్లు చేస్తే సరిపోతుందని వ్యాఖ్య
  • బ్యారేజీ కొట్టుకుపోవాలనేదే రేవంత్ కుట్ర అని ఆరోపణ
Revanth Reddy working for Chandrababu says Vinod

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ తీవ్ర ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 84 పిల్లర్లు ఉంటే కేవలం రెండు, మూడు మాత్రమే కుంగిపోయాయని ఆయన చెప్పారు. కుంగిన పిల్లర్లకు రిపేర్ చేస్తే సరిపోతుందని... అలా చేయకుండా ప్రాజెక్ట్ మొత్తం ప్రమాదంలో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు కొట్టుకుపోవాలనే మరమ్మతులు చేయడం లేదని... బ్యారేజీ కొట్టుకుపోతే గోదావరి నదీ జలాలు కింద ఉన్న ఏపీకి వెళ్తాయని... ఇది జరగాలనేదే రేవంత్ కుట్ర అని చెప్పారు. తన గురువు, టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే రేవంత్ ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 

చాలా ఎత్తులో ఉండే తెలంగాణలో గోదావరి జలాలను పారించడం కాళేశ్వరం ప్రాజెక్టుతోనే సాధ్యమయిందని వినోద్ చెప్పారు. దాదాపు 400 మీటర్ల ఎత్తుకు నదీ జలాలను ఎత్తి పోశామని, కోటి ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. ఇంత గొప్ప ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వాస్తవాలు ఏమిటో చూపించేందుకే మార్చి 1న కాళేశ్వరం పర్యటనకు వెళ్తున్నామని తెలిపారు. 

చేవెళ్ల సభలో కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై వినోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారమదంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందో ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. పార్టీ నాయకులపై కాంగ్రెస్ శ్రేణులకే నమ్మకం ఉండదని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడితే తిరిగి తమ ప్రభుత్వమే వస్తుందని చెప్పారు. కష్టపడితే అన్ని లోక్ సభ స్థానాలను గెలుచుకోవచ్చని అన్నారు.

More Telugu News