RGV Vyooham: మార్చి 2న వ్యూహం సినిమా విడుదల.. ఆర్జీవీ ట్వీట్

  • సెన్సార్ సర్టిఫికెట్ చూపిస్తూ ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ
  • పట్టువదలని విక్రమార్కుడిని అంటున్న ఆర్జీవీ
  • ఎట్టకేలకు థియేటర్లకు రానున్న వ్యూహం సినిమా
VYOOHAM in theatres MARCH 2nd Says RGV

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘వ్యూహం’ విడుదలపై సస్పెన్స్ వీడిపోయింది. వరుస వాయిదాలతో విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది. కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో మార్చి 2న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఆర్జీవీ ఓ ట్వీట్ లో వెల్లడించారు. కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను చూపిస్తూ.. ‘పట్టు వదలని విక్రమార్కుడిని’ అంటూ ట్వీట్ చేశారు. మార్చి 2న వ్యూహం సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సినిమాను ఆది నుంచీ వివాదాలు చుట్టుముట్టాయి.

వైఎస్సార్ మరణానంతరం ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యూహం సినిమాను ఆర్జీవీ తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాపై టీడీపీ, జనసేన వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జగన్ పొలిటికల్ మైలేజీ కోసం తమ నాయకులను కించపరిచేలా చూపించాడంటూ ఆర్జీవీపై మండిపడుతున్నాయి. ఈ సినిమాను విడుదల చేయకుండా ఆపాలని పలువురు టీడీపీ నేతలు కోర్టుకెక్కారు. దీంతో గతేడాది డిసెంబర్ 29 న విడుదల కావాల్సిన సినిమా రెండు నెలల తర్వాత థియేటర్లలోకి రానుంది. కోర్టు ఆదేశాలతో విడుదలను పదే పదే వాయిదా వేసిన ఆర్జీవీ.. పట్టు వదలకుండా పోరాడి వ్యూహం విడుదలకు అనుమతి తెచ్చుకున్నానని చెప్పారు.

More Telugu News