Revanth Reddy: ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ పథకాలకు అర్హతలివే... మీ పేరు లేకుంటే ఏం చేయాలంటే...!

  • మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
  • తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని వెల్లడి
  • మార్చి నుంచి 'సున్నా' బిల్లు అమలు చేయాలని డిస్కంలకు ఇంధనశాఖ ఆదేశాలు
guidelines for gruhajyothi and rs 500 gas cylinder

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించారు. ఆరు గ్యారెంటీలలోని 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయనున్నారు. ఈ రెండు పథకాలు కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి. 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడిన వినియోగదారులకు మార్చి నుంచి 'సున్నా' బిల్లు అమలు చేయాలని డిస్కంలకు ఇంధనశాఖ ఆదేశించింది. ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

గృహజ్యోతి పథకానికి అర్హత

- ప్రతి ఇంటికి ఒక కనెక్షన్‌కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- ప్రజాపాలన లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్లో ఆధార్‌తో అనుసంధానమైన తెల్లరేషన్‌ కార్డు, గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఉన్న వాటికి పథకం వర్తిస్తుంది.
- అర్హులైన ఇంటికి 200 యూనిట్ల వరకు 'జీరో' బిల్లును అందించాలి.
- జీరో బిల్లుల కోసం డిస్కంలు ఇప్పుడున్న పేర్లతోనే బిల్లులు మంజూరు చేయాలి.
- జీరో బిల్లులను ప్రభుత్వానికి పంపిస్తే డిస్కంలకు ప్రతి నెల 20వ తేదీ నాటికి ప్రభుత్వం రాయితీని అందిస్తుంది.
- గృహజ్యోతి పథకం కనెక్షన్‌ను వ్యాపార అవసరాలకు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి.
- అర్హతలు ఉండీ... ఈ పథకం కింద జీరో బిల్లు రాకపోతే సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లేదా సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలి. రేషన్ కార్డు, విద్యుత్ కనెక్షన్‌కు సంబంధించిన యూఎస్సీ వివరాలతో ప్రజాపాలన పోర్టల్ ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకొని... అధికారుల నుంచి రసీదు తీసుకోవాలి. పరిశీలన అనంతరం అర్హులని తేలితే ఆ మరుసటి నెల నుంచి జీరో బిల్లు మంజూరు చేస్తారు.

రూ.500 గ్యాస్‌కు అర్హత

- ప్రజాపాలనలో సబ్సిడీ గ్యాస్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి రూ.500కే గ్యాస్ ఇస్తారు.
- దరఖాస్తుదారులు తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి.
- దరఖాస్తుదారుని పేరుపై యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉండాలి.
- వినియోగదారుడు గత మూడేళ్లుగా వినియోగించిన లేదా బుక్ చేసిన సిలిండర్ల సంఖ్యను ఆధారం చేసుకొని... సగటున లెక్కించి పరిమిత సంఖ్యలో రూ.500కే గ్యాస్ ఇస్తారు.
- గ్యాస్ బుక్ చేసుకొని తీసుకునే సమయంలో మొత్తం డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత ఈ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు అందిస్తే, గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు డీబీటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాయి.

More Telugu News