Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి తాగుతూ పట్టుబడ్డ విద్యార్థులు

  • మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చిన స్టూడెంట్స్
  • బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ పైన గంజాయి ప్యాకెట్ల స్వాధీనం
  • పోలీసులకు సమాచారం అందించిన వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది
Basara IIIT Two Students Held For Consuming Ganja

బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. క్యాంపస్ లో గంజాయి తాగుతూ ఇద్దరు స్టూడెంట్లు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. దీంతో బాయ్స్ హాస్టల్ లో సోదా చేయగా.. బిల్డింగ్ పైన దాచిన గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయని సమాచారం. దీంతో వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే క్యాంపస్ కు చేరుకున్న పోలీసులు.. గంజాయి తాగుతూ పట్టుబడ్డ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ బిల్డింగ్ ను మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

వర్సిటీ క్యాంపస్ లోకి గంజాయి ఎలా వచ్చిందని ఆరా తీయగా.. మహారాష్ట్ర నుంచి విద్యార్థులు ప్యాకెట్ల రూపంలో తీసుకొచ్చినట్లు తేలిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాఫ్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వివరించారు. తెలంగాణలో ప్రముఖ విద్యాలయంగా పేరొందిన బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో గంజాయి పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై తోటి విద్యార్థులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News