Hanuma Vihari: ఇండియాకు ఆడిన క్రికెటర్ ఏపీకి ఆడననే స్థాయికి టార్గెట్ చేయబడ్డాడు: హనుమ విహారి నిష్క్రమణపై చంద్రబాబు, లోకేశ్

  • ఆంధ్ర క్రికెట్ లో రాజకీయ జోక్యం ఎక్కువయిందన్న హనుమ విహారి
  • భవిష్యత్తులో ఏపీ తరపున ఆడబోనని ప్రకటన
  • రెండు నెలల్లో మీకు రెడ్ కార్పెట్ పరుస్తామన్న నారా లోకేశ్
Chandrababu Naidu and Lokesh react on Hanuma vihari issue

ఆంధ్ర క్రికెట్ లో రాజకీయ జోక్యం ఎక్కువయిందని... భవిష్యత్తులో ఏపీ తరపున ఆడబోనని హనుమ విహారి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ నేత కుమారుడి కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించారని విహారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట తాను ఉండలేనని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

వైసీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటని చంద్రబాబు విమర్శించారు. హనుమ విహారి ఒక తెలివైన భారత అంతర్జాతీయ క్రికెటర్ అని.. ఆయన ఏపీ తరపున ఎప్పటికీ ఆడబోనని ప్రమాణ చేసే స్థాయికి టార్గెట్ చేయబడ్డాడని దుయ్యబట్టారు. హనుమా, మీరు దృఢంగా ఉండండి... క్రికెట్ పట్ల మీకున్న చిత్తశుద్ధి, కమిట్మెంట్ మీ గురించి ఎంతో గొప్పగా చెపుతాయని అన్నారు. ఈ అన్యాయమైన చర్యలు ఏపీ లేదా మన ప్రజల నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించవని చెప్పారు. మేము మీకు ఎప్పుడూ అండగా ఉంటామని... మీకు న్యాయం జరగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. 

నారా లోకేశ్ స్పందిస్తూ... అధికార పార్టీ రాజకీయ జోక్యం కారణంగా ఒక ప్రముఖ క్రికెటర్ అయిన హనుమ విహారి చేదు నిష్క్రమణపై తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. రెండు నెలల్లో హనుమ విహారి ఏపీ తరపున ఆడేందుకు తాను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. విహారికి, ఏపీ టీమ్ కు తాము రెడ్ కార్పెట్ పరుస్తామని... వచ్చే రంజీ ట్రోఫీని ఏపీ గెలుపొందేందుకు అవసరమైన సహాయాలన్నింటినీ అందిస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News