Paytm Field Manager: పేటీఎం మూసేస్తారని భయం.. ఫీల్డ్ మేనేజర్ ఆత్మహత్య

  • ఇండోర్ నగరంలో ఘటన
  • జాబ్ పోవచ్చనే భయంతోనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చన్న పోలీసులు 
  • ఘటనకు బీజేపీ ప్రభుత్వానిదే బాధ్యత అన్న రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్
Paytm field manager ends life over fear of job loss

మధ్యప్రదేశ్‌లో పేటీఎం ఫీల్డ్ మేనేజర్ ఒకరు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇండోర్‌కు చెందిన గౌరవ్ గుప్తా (40) స్కీమ్ నెంబర్ 48లోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటన స్థలిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే, పేటీఎం సంస్థ మూసేస్తారనే భయంతోనే గౌరవ్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

నిబంధనలు అతిక్రమించిన పేటీఎం బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంకు పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. మార్చి 15 నుంచి కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, సంస్థను ఒక్కసారిగా సంక్షోభం చుట్టుముట్టింది. పేటీఎం షేర్ల ధరలు పతనం కాగా, ఇటీవలే సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 

మరోవైపు, ఫీల్డ్ మేనేజర్ ఆత్మహత్యపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితేంద్ర పట్వారీ బీజేపీపై మండిపడ్డారు. పేటీఎం సంక్షోభానికి బీజేపీ ప్రభుత్వమే కారణమన్నారు. పేటీఎంను మూసేస్తే తన జాబ్ పోతుందన్న భయంతోనే ఫీల్డ్ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.

More Telugu News