Arvind Kejriwal: పరువు నష్టం కేసులో తన తప్పును అంగీకరించిన అరవింద్ కేజ్రీవాల్, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

  • యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వీడియోను రీట్వీట్ చేయడంతో కేజ్రీవాల్‌పై క్రిమినల్ కేసు నమోదు
  • ట్రయల్ కోర్టు సమన్లను కొట్టివేయడానికి నిరాకరించిన హైకోర్టు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
  • వీడియోను రీట్వీట్ చేయడం పొరపాటేనని అంగీకరించిన కేజ్రీవాల్
  • దీంతో కేజ్రీవాల్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు
Arvind Kejriwal Admits In SC Over Retweeting Defamatory Video

బీజేపీ ఐటీ సెల్‌కు వ్యతిరేకంగా యూట్యూబ్ వీడియోను రీట్వీట్ చేసినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పరువునష్టం కేసును కొనసాగించకుండా ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు సోమవారం నిరోధించింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణను మార్చి 11కి వాయిదా వేసింది. ఈ లోగా ఈ అంశంపై విచారణ చేపట్టవద్దని, కేజ్రీవాల్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ 2018లో రూపొందించినట్లు చెబుతున్న ఓ వీడియోను కేజ్రీవాల్‌ రీట్వీట్‌ చేశారు. దీంతో ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదయింది. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. ఒకరిని కించపరిచేలా ఉన్న వీడియోను ఇతరులకు పంపడం కూడా పరువునష్టం చట్టం కింద నేరమే అవుతుందని, అలాంటి విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు సమన్లను కొట్టివేయడానికి నిరాకరించింది. దీంతో కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పరువుకు భంగం కలిగించేలా ఉన్న ఆ వీడియోను రీట్వీట్ చేయడం పొరపాటు అని, కేసును మూసివేయాలని కేజ్రీవాల్‌ కోరారు. ఈ మేరకు కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ న్యాయస్థానానికి తెలిపారు. కేజ్రీవాల్ తన తప్పును అంగీకరించినందున ఈ కేసులో ఫిర్యాదుదారు సూచనను సుప్రీంకోర్టు కోరింది. దీనిపై తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది రాఘవ్ అవస్తీ సమయాన్ని కోరారు. దీంతో ఈ కేసులో కేజ్రీవాల్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ట్రయల్‌ కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశిస్తూ, తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది.

More Telugu News