G. Kishan Reddy: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఒరిగేదేమీ లేదు... కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు: కిషన్ రెడ్డి

  • భాగ్యలక్ష్మి క్లస్టర్ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న కిషన్ రెడ్డి
  • లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని మరోసారి ఆశీర్వదించాలని కోరిన కిషన్ రెడ్డి
  • మోదీ అభివృద్ధి, సంక్షేమంతో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తూ జాతి గౌరవాన్ని పెంపొందించారని వ్యాఖ్య
Kishan Reddy participates in Vijaya Sankalpa Yatra

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేయడం వల్ల ఒరిగేదేమీ లేదని, అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపించడం లేదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కలిసి నడుద్దాం... నరేంద్ర మోదీని మరోసారి గెలిపిద్దాం అనే నినాదంతో తెలంగాణ బీజేపీ ఆయా జిల్లాల్లో విజయ సంకల్ప యాత్రలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భాగ్యలక్ష్మీ క్లస్టర్ అమీర్‌పేట బహిరంగ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని పద్మారావు నగర్, బైబిల్ హౌస్, మహంకాళి వీధి, మోండా మార్కెట్, బేగంపేట ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మూడోసారి మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అవినీతిరహిత పరిపాలన సాగిస్తూ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన గొప్ప నాయకుడు మోదీ అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తూ జాతి గౌరవాన్ని పెంపొందించినట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, విమానాశ్రయాల పెంపు, పేదలందరికీ నాణ్యమైన బియ్యం, కరోనా వ్యాక్సీన్ పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు మోదీ హయాంలో అమలు అయ్యాయన్నారు. మోదీ పాలనలో అన్ని వర్గాల వారు సంతోషంతో ఉన్నారన్నారు.

More Telugu News