YS Jagan: కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకోండి... నా కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తా: సీఎం జగన్

  • కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో బహిరంగసభ
  • హాజరైన సీఎం జగన్
  • కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడంటూ విమర్శలు
  • చంద్రబాబు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని వ్యాఖ్యలు
  • భరత్ ను గెలిపిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వెల్లడి
CM Jagan appeals vote for Bharat in Kuppam

కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. కుప్పానికి ఏమీ చేయని చంద్రబాబు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండేందుకు అర్హుడేనా? అని నిలదీశారు. 

చంద్రబాబు నాడు మంత్రిగా ఉంటూ చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారని, కుప్పం వచ్చి 35 ఏళ్లుగా గెలుస్తూ కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదని అన్నారు. దీన్నిబట్టే ఇక్కడి ప్రజలపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని దెప్పిపొడిచారు. 

సొంత నియోజకవర్గం సంక్షేమాన్ని పట్టించుకోని ఈ వ్యక్తి (చంద్రబాబు) 75 ఏళ్ల వయసులో నలుగురితో పొత్తు పెట్టుకుని వస్తున్నాడని సీఎం జగన్ విమర్శించారు. పొత్తులు దేనికి అంటే సమాధానం చెప్పడని అన్నారు. ఏదైనా ఒక గ్రామంలోకి వెళ్లి మీ మార్కు మంచి పని ఏదైనా చేశారా అంటే అదీ చెప్పడు అని పేర్కొన్నారు. అన్నీ మంచి పనులు చేశానంటున్న చంద్రబాబు... ఎన్నికల్లో గెలిచేందుకు పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా భరత్ నిలబడుతున్నాడని, కుప్పం ప్రజలు భరత్ ను ఆశీర్వదించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకుంటే తన కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని, తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని సభాముఖంగా ప్రకటించారు. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం అందిస్తానని స్పష్టం చేశారు. 

"పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్కు రాజకీయం కావాలా... లేక ఎన్నికలప్పుడు ప్రజలను వాడుకునే చంద్రబాబు మార్కు రాజకీయం కావాలా? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గానికి మంచి జరిగిందా? మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి జరిగిందా? కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ నీటిని తీసుకువచ్చింది మీ జగన్... కుప్పంను మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్. కుప్పంనకు రెవిన్యూ డివిజన్ తీసుకువచ్చింది మీ జగన్. చిత్తూరు పాలడెయిరీని పునఃప్రారంభించింది మీ జగన్" అంటూ సీఎం జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

"చంద్రబాబుకు నాపై కోపం వస్తే కడపను, పులివెందులను తిడతాడు. ఆఖరికి రాయలసీమను కూడా తిడతాడు. కానీ నేను ఏనాడూ కుప్పంను పల్లెత్తు మాట అనలేదు. కుప్పం నియోజకవర్గాన్ని కానీ, ఇక్కడి ప్రజలను కూడా ఒక్క మాట అనలేదు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను" అని సీఎం జగన్ స్పష్టం చేశారు. 

"14 ఏళ్లు పాలించానంటాడు... ఏం చేశాడు అంటే పెద్ద సున్నా అని సమాధానం వస్తుంది. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు మోసం చేయడానికి తయారవుతాడు. ఇంటింటికీ కిలో బంగారం, ఒక బెంజి కారు అంటాడు... అవసరానికి వాడుకుని ఆ తర్వాత వదిలేసే నాయకుడు చంద్రబాబు. ఇలాంటి నాయకుడు కావాలా... చెప్పింది చేసే మీ బిడ్డ కావాలా?" అంటూ ప్రసంగించారు.

More Telugu News