Drug Case: గచ్చిబౌలి స్టార్ హోటల్‌లో డ్రగ్స్‌తో విందు.. పట్టుబడిన వారిలో రాజకీయ నాయకుడి కుమారుడు

  • గత రాత్రి హోటల్‌లో విందు కార్యక్రమం
  • హాజరైన వారు కొకైన్ తీసుకున్నట్టు అనుమానం
  • రాజకీయ నేత కుమారుడితో పాటు మరో ఇద్దరి అరెస్ట్
Politician son among three who arrested in drug case in Hyderabad

హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోయినట్టు లేదు. డ్రగ్స్ తీసుకుంటూ, విక్రయిస్తూ దొరుకుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా నేడు గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ  క్రమంలో ఓ రాజకీయ నాయకుడి కుమారుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి హోటల్‌లో నిర్వహించిన విందు కార్యక్రమంలో వారంతా డ్రగ్స్ వినియోగించినట్టు తెలుస్తోంది.

పార్టీకి హాజరైన వారు కొకైన్‌ను తీసుకున్నట్టు అనుమనిస్తున్నారు. కాగా, గతవారం యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి తాగుతూ దొరికాడు. ఫీచర్ ఫిల్మ్‌లలో నటించే ఓ నటి ఇటీవల డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు రెడ్ ‌హ్యాండెడ్‌గా చిక్కింది. గతేడాది సెప్టెంబర్‌లో రాజేంద్రనగర్ పరిధిలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్‌రెడ్డి, మహిళా డ్రగ్ సరఫరాదారు లింగంపల్లి అనురాధ సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, తాజా కేసులో పట్టుబడిన రాజకీయ నాయకుడి కొడుకు ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.

More Telugu News