K Kavitha: సీబీఐ నోటీసులు.. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కవిత భేటీ

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు సీబీఐ నోటీసులు
  • ఈరోజు ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశం
  • సీబీఐ విచారణకు వెళ్లని కవిత
Kavitha meets KCR in farm house amid CBI notices

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈరోజు (26న) ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఇంతకు ముందు ఈ కేసులో కవిత కేవలం సాక్షిగా మాత్రమే ఉన్నారు. అయితే, ఆమెను నిందితురాలిగా మారుస్తూ సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కవిత సీబీఐకి లేఖ రాశారు. 

సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని లేఖలో కవిత కోరారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసులకు విరుద్ధంగా ఈ నోటీసులు ఉన్నాయని ఆమె చెప్పారు. సీబీఐకి ఏవైనా సమాధానాలు కావాలంటే... తాను వర్చువల్ పద్ధతితో విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో... తనకు ప్రచార బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. ఈ కారణంగా తాను ఢిల్లీకి విచారణకు రాలేనని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో, తనకు జారీ చేసిన నోటీసుల నిలిపివేత విషయాన్ని పరిశీలించాలని కోరారు. 

మరోవైపు, సీబీఐ నోటీసుల నేపథ్యంతో కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఫామ్ హౌస్ కు వెళ్లిన కవిత... కేసీఆర్ తో ఈ అంశంపై చర్చిస్తున్నారు.

More Telugu News