Mahalaxmi Scheme: తెలంగాణలో రేపటి నుంచే రూ.500 సిలిండర్.. అమలు ఇలా..!

  • గ్యాస్ డెలివరీ సమయంలో మొత్తం ధర చెల్లించాల్సిందే
  • కేంద్రం సబ్సిడీతో పాటు మిగతా మొత్తం బ్యాంకు ఖాతాలో జమ
  • ఉజ్వల లబ్దిదారులకూ మహాలక్ష్మి పథకం అమలు
Government Favors Cash Transfer for Subsidized Gas Cylinders

మహాలక్ష్మి పథకం కింద రేపటి నుంచి రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం లబ్దిదారులనూ ఈ స్కీమ్ కు ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే, ఈ స్కీమ్ లబ్దిదారులు ముందు గ్యాస్ ధర మొత్తం చెల్లించాల్సిందేనని, ఆ తర్వాతే ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు రూ.40 సబ్సిడీ అందిస్తోంది. ఈ మొత్తం నేరుగా లబ్దిదారుడి ఖాతాలో జమ అవుతోంది. మహాలక్ష్మి స్కీమ్ కింద గ్యాస్ ధర రూ.500, కేంద్ర సబ్సిడీ రూ.40 పోనూ మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికీ ఇదే విధానంలో రీయింబర్స్ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 11.58 లక్షల ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా.. వీరికి ప్రతీ సిలిండర్ పై కేంద్రం రూ.340 రాయితీ ఇస్తోంది. ఈ మొత్తంతో పాటు గ్యాస్ ధర రూ.500 ను మినహాయించి మిగతా సొమ్మును రాష్ట్రప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో వేయనుంది. ఉదాహరణకు హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ.970 ఉంటే.. అందులో ఉజ్వల పథకం సబ్సిడీ రూ.340, మహాలక్ష్మి స్కీమ్ ధర రూ.500 పోనూ మిగిలిన మొత్తం రూ.130 ను రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. కాగా, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎంసీ)లతో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు సమావేశమై మహాలక్ష్మి పథకం అమలుపై చర్చించారు. సోమవారం నాడు లబ్దిదారుల జాబితాను అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

More Telugu News