K Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు: సీబీఐకి లేఖ రాసిన కవిత

  • గతంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను సాక్షిగా పేర్కొన్న సీబీఐ
  • అప్పట్లో సెక్షన్ 160 కింద నోటీసులు
  • తాజాగా కవితను నిందితురాలిగా మార్చిన సీబీఐ
  • ఇటీవల సెక్షన్ 41ఏ కింద నోటీసులు
  • ఈ నెల 26న తాను విచారణకు రాలేనని తేల్చి చెప్పిన కవిత 
Kavitha wrote CBI that she can not attend questioning on Feb 26

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలిగా పేర్కొన్న సీబీఐ ఆ మేరకు నోటీసులు పంపడం తెలిసిందే. కవితకు సీబీఐ గతంలోనే నోటీసులు ఇవ్వగా, అందులో ఆమెను సాక్షిగా పేర్కొన్నారు. 

ఇప్పుడామె పేరును నిందితుల జాబితాలో చేర్చినందున... నోటీసులకు సవరణ చేస్తూ ఆమెను నిందితురాలిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కవిత సీబీఐకి లేఖ రాశారు. నోటీసుల్లో పేర్కొన్నట్టు ఈ నెల 26న తాను విచారణకు రాలేనని తేల్చి చెప్పారు. 

2022లో తనకు సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారని, కానీ ఆ నోటీసులకు ఇప్పడు సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులకు చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారన్నదానిపై స్పష్టత లేదని కవిత తెలిపారు. 

అంతేకాదు, మరి కొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న సమయంలో నోటీసులు ఇవ్వడం అనే ప్రశ్నలు రేకెత్తిస్తోందని తన లేఖలో వివరించారు. బీఆర్ఎస్ తరఫున తాను ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో తాను ఢిల్లీ రావడం వల్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అందుకే, 41ఏ నోటీసులను రద్దయినా చేయండి, లేదా వెనక్కి అయినా తీసుకోండి అని కవిత విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సీబీఐ తన నుంచి ఏవైనా ప్రశ్నలకు సమాధానాలు కోరుకుంటే వర్చువల్ పద్దతిలో హాజరయ్యేందుకు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

More Telugu News