YV Subba Reddy: చంద్రబాబు కళ్లలో బంగారు భవిష్యత్తు చూసేందుకే..: పవన్ పై వైవీ సుబ్బారెడ్డి సెటైర్లు

  • వైసీపీ తుది జాబితాలో చోటు దక్కిన వారే అభ్యర్థులన్న సుబ్బారెడ్డి
  • టీడీపీకి 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని ఎద్దేవా
  • ఎన్ని కూటములు వచ్చినా వైసీపీదే గెలుపని ధీమా
YV Subba Reddy satires on Chandrababu

ఇప్పటివరకు ఇన్ఛార్జీలుగా నియమించిన వారంతా కేవలం సమన్వయకర్తలు మాత్రమేనని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తుది జాబితాలో చోటు దక్కిన వాళ్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులని ఆయన స్పష్టం చేశారు. ఆఖరి 'సిద్ధం' తర్వాత అభ్యర్థుల తుది జాబితా, మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు. అరాచక అభ్యర్థులకు టికెట్ ఇచ్చే సంస్కృతి వైసీపీకి లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వల్ల మేలు జరిగితేనే మళ్లీ మాకు ఓటు వేయాలని చెప్పే ధైర్యం జగన్ కు తప్ప ఇంకెవరికైనా ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ ను షర్మిల వచ్చినంత మాత్రాన ఎవరూ పట్టించుకోరని అన్నారు. 

టీడీపీ - జనసేన కూటమి అభ్యర్థుల జాబితాపై స్పందిస్తూ... అభ్యర్థుల ఎంపిక కోసం ఎప్పుడూ చేయనంత సుదీర్ఘ కసరత్తు చేశానని చంద్రబాబు అన్నారని... చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చిందంటే వైసీపీ అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. టీడీపీకి ఇప్పటికీ 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని... అభ్యర్థులను వెతుక్కునే పనిలో వారు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు బంగారు భవిష్యత్తును చూసేందుకే పవన్ కల్యాణ్ 24 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్ని కూటములు వచ్చినా గెలుపు వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News