india vs England: ముగిసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్.. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన భారత్

  • 353 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్
  • రెండో రోజు మిగిలిన 3 వికెట్లు తీసిన స్పిన్నర్ రవీంద్ర జడేజా
  • ఆరంభంలోనే వ్యక్తిగత స్కోరు 2 వద్ద ఔటైన కెప్టెన్ రోహిత్ శర్మ
Englands first innings ended at 353 and India lost the first wicket for 4 runs

రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్‌ నైట్ స్కోరు 302/7 వద్ద రెండవ రోజు బ్యాటింగ్‌ను ఆరంభించిన పర్యాటక జట్టు మరో 51 పరుగులు జోడించి 353 పరుగులకు ఆలౌట్ అయింది. చెలరేగిన స్పిన్నర్ రవీంద్ర జడేజా చివరి ముగ్గురు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను ఔట్ చేశాడు. రాబిన్సన్(58), షోయబ్ బషీర్ (0), జేమ్స్ అండర్సన్ (0) పరుగుల వద్ద ఔటయ్యాడు. సెంచరీ హీరో జో రూట్ (122) నాటౌట్‌గా నిలిచాడు.

ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టు స్కోరు 4 పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. 9 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ రోహత్ శర్మ వ్యక్తిగత స్కోర్ 2 పరుగుల వద్ద ఔటయ్యాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఫోక్స్‌‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 20/1గా ఉంది.

ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (42), డకెట్‌(11) ఒల్లీ పోప్(0), జో రూట్‌(122 నాటౌట్), జానీ బెయిర్‌స్టో(38), స్టోక్స్(3), టామ్ హార్ట్లీ(13), రాబిన్సన్(58), షోయబ్ బషీర్ (0), జేమ్స్ అండర్సన్(0) చొప్పున పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, ఆకాశ్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ 1 చొప్పున వికెట్లు తీశారు.

More Telugu News