AP Elections: హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్న చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్

  • టీడీపీ, జనసేన మధ్య ఓ కొలిక్కి రాని సీట్ల పంపకం
  • ఎవరు ఏ స్థానంలో పోటీ చేసేది స్పష్టత ఇచ్చేందుకు ఇరు పార్టీల కసరత్తులు
  • త్వరలోనే టీడీపీ-జనసేన తొలి జాబితా
TDP and Janasena top brass arrived Amaravati from Hyderabad

సీట్ల సర్దుబాటును ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు టీడీపీ, జనసేన అధినాయకత్వాలు మళ్లీ రంగంలోకి దిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైదరాబాద్ నుంచి ఉండవల్లి చేరుకోగా... జనసేనాని పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు. 

పొత్తు, ఉమ్మడి కార్యాచరణ, సీట్ల పంపకం దిశగా టీడీపీ, జనసేన కసరత్తులు ముమ్మరం చేశాయి. ఎవరు ఏ స్థానంలో పోటీ చేసేదీ స్పష్టత ఇచ్చే దిశగా చర్యలు వేగవంతం చేశాయి. కసరత్తులు పూర్తయిన పిమ్మట త్వరలోనే టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల చేయనున్నారు. 

రేపు (ఫిబ్రవరి 24) పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు అందుబాటులో ఉండాలని ముఖ్యనేతలకు సూచనలు వెళ్లాయి. అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు తదితర అగ్రనేతలకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి సమావేశం గురించి చెప్పారు. 

సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. ముఖ్య నేతలతో సమావేశం తర్వాత కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ కూడా టీడీపీ-జనసేన కూటమితో చేయి కలిపితే, బీజేపీకి కేటాయించే సీట్లను రెండో జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది.

More Telugu News