Jagan: వంద మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ: సీఎం జగన్

  • ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ సభ
  • ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్
  • చంద్రబాబు అసూయతో రగిలిపోతున్నాడని విమర్శలు
  • కుట్రలన్నీ అధిగమించి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని వెల్లడి
CM Jagan take a swipe at Chandrababu

ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సభలో జగన్ ప్రసంగిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. 

తాము పేదలకు మంచి చేస్తుంటే చంద్రబాబు అసూయతో రగిలిపోతున్నాడని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయనివ్వకుండా 1,191 కేసులు వేయించారని ఆరోపించారు. అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆ కుట్రలన్నీ అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని సీఎం జగన్ వెల్లడించారు. 

చంద్రబాబు రాజకీయ రాక్షసుడు అని, వంద మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువని విమర్శించారు. 21 వేల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, ఇది దేశంలోనే ఒక చరిత్ర అని అభివర్ణించారు. 

నేను నమ్ముకుంది మిమ్మల్ని, దేవుడిని!

ఈ జగన్ మీ బిడ్డ. నా వల్ల, మా ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి. నేను నమ్ముకుంది మిమ్మల్ని, దేవుడ్ని. చంద్రబాబులాగా నేను దళారీలను నమ్ముకోలేదు. చంద్రబాబు వంటివారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి. కుప్పం నుంచే బాబు బై బై అంటున్నారు... చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మడంలేదు. మనం సిద్ధం అంటుంటే బాబు అర్ధాంగి సిద్ధంగా లేమని అంటున్నారు.

More Telugu News