Hyderabad: ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడు.. కక్షగట్టి పరువు తీసేందుకు యత్నించి కటకటాలపాలైన యువతి

  • హైదరాబాద్ అశోక్‌నగర్‌లో గ్రూప్-1కు శిక్షణ పొందుతున్న అనంతపురం జిల్లా యువతి
  • ఇనిస్టిట్యూట్ అధ్యాపకుడిపై మనసు పారేసుకున్న యువతి
  • విషయం చెబితే తనకు వివాహమై భార్యాపిల్లలు ఉన్నారని మందలించిన అధ్యాపకుడు
  • చదువుపై దృష్టి సారించాలని చెప్పడంతో కక్షగట్టి మార్ఫింగ్ ఫొటోలతో వేధింపులు
Woman Arrested For Posted Morphed Photos Of Tutor Wife And Daughter

తన ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడిపై కక్షగట్టిన ఓ యువతి ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటోంది. హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతానికి చెందిన యువతి (24) గ్రూప్-1 శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చి అశోక్‌నగర్‌లోని ఓ ఇనిస్టిట్యూట్‌లో చేరింది. అక్కడ ఓ సబ్జెక్టు బోధించే అధ్యాపకుడిపై మనసు పారేసుకున్న యువతి విషయాన్ని అతడికి చెప్పింది. 

ఆమె చెప్పింది విన్న అతడు షాకయ్యాడు. తనకు ఇప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని చెప్పి ఆమెను మందలించాడు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న ఆమె.. అతడి భార్య, కుమార్తె ఫొటోలు సేకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా తెరవడంతోపాటు యూట్యూబ్‌ చానెల్ ప్రారంభించింది. వాటిలో అధ్యాపకుడి భార్య, కుమార్తె ఫొటోలను మార్ఫింగ్ చేసి పెట్టింది. 

అక్కడితో ఆగకుండా అధ్యాపకుడు పనిచేస్తున్న ఇనిస్టిట్యూట్‌తోపాటు హైకోర్టు అధికారిక పేజీలు, విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో అసభ్య పదజాలంతో వాటిని షేర్ చేస్తూ వేధించడం మొదలుపెట్టింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి అనంతపురంలో ఉన్న నిందితురాలిని గురువారం అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News