Jahnavi USA: అమెరికాలో జాహ్నవి మృతి కేసు తీర్పుపై కేటీఆర్ స్పందన.. జయశంకర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

  • రోడ్డు దాటుతుండగా జాహ్నవిని ఢీకొన్న పోలీసు వాహనం
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన జాహ్నవి
  • ఢీకొట్టిన పోలీసు అధికారిపై సరైన ఆధారాలు లేవన్న అమెరికా కోర్టు
KTS response on Jahnavi accidental death in USA

కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) అమెరికా సియాటెల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది రోడ్డు దాటుతున్న ఆమెను పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత ఆమె మృతిపై అక్కడి పోలీసు అధికారి కెవిన్ డేవ్ చులకనగా మాట్లాడటం అమెరికాలో కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనిపై భారత ప్రభుత్వం సీరియస్ గా ప్రతిస్పందించింది. సదరు అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పోలీస్ వాహనం బలంగా ఢీకొనడంతో జాహ్నవి ఎగిరి 100 మీటర్లకు పైగా దూరంలో పడిపోయిందని సియాటెల్ పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. 

అయితే జాహ్నవిని ఢీకొట్టి చంపిన పోలీసు అధికారిపై సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఆయనపై ఎలాంటి చర్యలు ఉండబోవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ... ఈ అంశంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ వెంటనే జోక్యం చేసుకుని... అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి... ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నత లక్ష్యాలతో అమెరికాకు వెళ్లిన జాహ్నవి ఇలా చనిపోవడం అత్యంత బాధాకరమని చెప్పారు. ఆమెకు న్యాయం జరగకుండా కేసు ఇలా తేలిపోవడం మరింత బాధాకరమని అన్నారు.

More Telugu News