India alliance: ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు.. 17 సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్

  • యూపీలోని మిగతా 63 స్థానాల్లో సమాజ్ వాదీ సహా కూటమిలోని ఇతర పార్టీల పోటీ
  • సీట్ల సర్దుబాటులో ప్రియాంక గాంధీ కీలక పాత్ర
  • అఖిలేశ్ యాదవ్‌తో మాట్లాడి కొలిక్కి తీసుకొచ్చిన వైనం  
Adjustment of seats between India alliance parties in Uttar Pradesh and Congress settled to contest in 17 seats

సుదీర్ఘ సంప్రదింపులు, చర్చల అనంతరం ఉత్తరప్రదేశ్‌లో విపక్ష ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలోని 17 సీట్లలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది. దీంతో మిగతా 63 స్థానాలను సమాజ్ వాదీ పార్టీతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలు పంచుకోనున్నాయి. ఈ మేరకు ఇండియా కూటమి బుధవారం ఖరారు చేసింది. 

సీట్ల పంపిణీ ఖరారయ్యిందని కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే మీడియా సమావేశంలో వెల్లడించారు. యూపీలో కాంగ్రెస్ 17 చోట్ల పోటీ చేస్తుందని, మిగిలిన 63 స్థానాల్లో కూటమిలోని ఇతర పార్టీలు పోటీ చేస్తాయని సంతోషంగా ప్రకటిస్తున్నామని వ్యాఖ్యానించారు. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చాక సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా స్పందించారు. సామరస్యంగా సీట్లను సర్దుబాటు చేసుకున్న ఇండియా కూటమిలోని ప్రతి ఒక్కరికి అభినందనలు అంటూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, రామ్ మనోహర్ లోహియా సూచించిన సంఖ్యా భాగస్వామ్య సూత్రాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అఖిలేశ్ యాదవ్ అన్నారు. సమానత్వం కోసం సోషలిస్టు విలువలను క్రియాశీలకం చేస్తామన్నారు. 

కాగా సీట్ల సర్దుబాటు విషయంలో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. రాహుల్ గాంధీతో సంప్రదిస్తూ అఖిలేశ్ యాదవ్‌తో చర్చలు జరిపినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

తొలుత అదనంగా మొరాదాబాద్ ఎంపీ సీటు కూడా తమకు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ కోరింది. అయితే, చివరికి పరిస్థితులను అర్థం చేసుకుని, ఆ సీటు కోసం అంతగా పట్టుబట్టకుండా 17 సీట్లతో సరిపెట్టుకుంది. దీంతో రాష్ట్రంలో ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. రాయబరేలి, అమేథి, కాన్పూర్ నగర్, ఫతేపూర్ సిక్రీ, బాన్స్‌గావ్, సహరాన్‌పూర్, ప్రయాగ్‌రాజ్, మహారాజ్‌గంజ్, వారణాసి, అమ్రోహ, ఝాన్సీ, బులంద్‌షెహర్, ఘజియాబాద్, మధుర, సీతాపూర్, బారాబంకీ, డియోరియా సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయనుంది.

More Telugu News