Medaram Jatara: మేడారం జాతరకు పోటెత్తుతున్న భక్తులు

  • ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర
  • వనదేవతలుగా పేరుగాంచిన సమ్మక్క-సారలమ్మ
  • అతిపెద్ద గిరిజన పండుగల్లో ఒకటిగా మేడారం జాతర 
Huge number of devotees rushes to Medaram Jathara

తెలంగాణలో చారిత్రాత్మక మేడారం జాతర నేడు ప్రారంభమైంది. గిరిజనులకు అతి పెద్ద పండుగగా పేరుగాంచిన ఈ సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఒక్క తెలంగాణ ఆర్టీసీ ద్వారానే 1.50 లక్షల మంది భక్తులు మేడారం తరలివచ్చారు. ఇప్పటిదాకా ఆర్టీసీ మేడారం జాతరకు 3,600 ట్రిప్పులు నడపడం విశేషం. అటు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ రైడ్ కూడా ఏర్పాటు చేయడం తెలిసిందే. 

మేడారంలో ఈసారి లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భారీ డిజిటల్ స్క్రీన్లపై వనదేవతలు సమ్మక్క-సారలమ్మ జీవిత చరిత్రను ప్రదర్శిస్తున్నారు. మేడారం జాతరలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న వాటిలో ఇదొకటి. 

కాగా, మేడారం జాతరపై మంత్రి సీతక్క స్పందించారు. మేడారం మహా జాతరకు భారీగా భక్తులు తరలి వస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. మేడారం జాతరకు గతంలో ఎడ్లబండ్లపై వచ్చేవారని, ఇప్పుడు హెలికాప్టర్లలో వస్తున్నారని వివరించారు. 

సమ్మక్క-సారలమ్మ పూజలు రహస్యంగా నిర్వహిస్తారని, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు భంగం కలగకుండా చర్యలు తీసుకున్నామని సీతక్క చెప్పారు. 

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక మొదటిసారి జాతరకు వస్తున్నారని వెల్లడించారు. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆయనను కోరతామని చెప్పారు.

More Telugu News