Nara Bhuvaneswari: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు: నారా భువనేశ్వరి

  • కుప్పంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
  • ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ కార్యక్రమంలో మహిళలతో ముఖాముఖి
  • వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితులు దిగజారాయన్న భువనేశ్వరి
  • అత్యాచారాల్లో ఏపీ నెంబర్ వన్ అయిందని విమర్శలు
  • అరాచకాల గురించి చెప్పాలంటే సంవత్సరాలు సరిపోవని వెల్లడి
Nara Bhuvaneswari held meeting with Women in Kuppam

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో పర్యటించారు. నిజం గెలవాలి యాత్ర కోసం వచ్చిన నారా భువనేశ్వరి  ఆడబిడ్డలకు ఆర్థికస్వేచ్ఛ కార్యక్రమంలో కుప్పం మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం పరిస్థితి క్షీణించిందని అన్నారు. జగన్ పాలనలో ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని,   మహిళలపై అత్యాచారాల్లో ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని నారా భువనేశ్వరి విమర్శించారు. 

"ఓ మహిళకు గంజాయి అలవాటు చేసి నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు... ఈ విషయాలపై జగన్ సిగ్గుపడాలి.    ఏపీలో 2019 నుండి 2021వరకు 30,196 మంది మహిళలు మిస్ అయ్యారని చట్టసభల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు మాట్లాడుకుంటున్నారు. మిస్ అయిన వారిని కనిపెట్టడానికి పోలీసులు, వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.    ఇదే పరిస్థితిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు" అని భువనేశ్వరి స్పష్టం చేశారు. 

ఆయన వల్లే మహిళలు రాజకీయాల్లో ముందుకు వెళుతున్నారు!

కుప్పం నారీమణులకు పేరు పేరునా నా నమస్కారాలు. ఒకప్పుడు స్త్రీని అబలగా చూసేవారు... వారిని వంటింటికే పరిమితం చేసేవారు.    స్త్రీలకు గౌరవం, ధైర్యం, హక్కులు ఇచ్చి మహిళలను సమాజంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 1986లో ఎన్టీఆర్ స్త్రీలకు ఆస్తిలో సమానహక్కును కల్పించి చరిత్ర సృష్టించారు. మహిళలకు తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీని తీసుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేశారు. ఆయనవల్లే మహిళలు నేడు రాజకీయాల్లో ముందుకెళుతున్నారు.

చంద్రబాబు హయాంలో ప్రతి కిలోమీటరుకు ప్రాథమిక పాఠశాలలు, మూడు కిలోమీటర్లలో అప్పర్ ప్రైమరీ, 5 కిలోమీటర్లకు హైస్కూలు వీటితో పాటు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. చంద్రబాబు తెచ్చిన ఐటీ వల్ల యువత మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు... వారి కుటుంబాలు బాగున్నాయి.   మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్, డ్వాక్రా సంఘాలను చంద్రబాబు ముందుచూపుతో తీసుకొచ్చారు.

వాటి గురించి చెప్పాలంటే సంవత్సరాలు సరిపోవు!

జగన్ పాలనలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి చెప్పాలంటే సంవత్సరాలు సరిపోవు.   చంద్రబాబు పాలనలో మహిళలు ధైర్యంగా బయట తిరిగేవారు. కానీ, నేడు జగన్ పాలనలో ఆ భరోసా లేదు. ప్రొద్దుటూరులో 6 సంవత్సరాల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడితే ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆర్డర్ వేస్తే... ఆ నిందితుడు ప్రాణభయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. 

దిశ యాప్, పథకం ద్వారా మహిళలకు రక్షణ ఎక్కడా దొరకడం లేదు. చట్టం కాగితాలకే పరిమితమైంది. మహిళలను మాయ చేయడానికి, మహిళలకు ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికే దిశ పథకాన్ని జగన్ అమలు చేస్తున్నారు.

ప్రశ్నోత్తరాలు....

సరస్వతి: చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల కోసం 20కి పైగా పథకాలు తెచ్చారు. ఆ నాడే మహిళలను ఆర్టీసీ కండక్టర్లుగా నియమించారు. మహిళలకు ప్రోత్సాహం విషయంలో చంద్రబాబు గారి ఆలోచనలు ఎలా ఉంటాయి?

జవాబు:- చంద్రబాబుగారి ఆలోచన ఎప్పుడూ ఒక్కటే. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు అని. అందుకే ఆయన దళిత మహిళను అసెంబ్లీ స్పీకర్ ను చేశారు. ఇదొక చరిత్ర. అదేవిధంగా ఆర్టీసీలో మహిళా కండక్టర్ల ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యత, ఐటీ తీసుకురావడంతో మహిళలకు అపారమైన ఉద్యోగావకాశాలు, నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు, కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం, సబ్సిడీ లోన్లు ద్వారా చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా మహిళలను ప్రోత్సహించారు. మహిళల గురించి చంద్రబాబుగారి ఆలోచనలు ఒక్కమాటలో చెప్పాలంటే ‘‘మహిళలు మగవాళ్లకంటే ఏమీ తక్కువ కాదు...మహిళలు దైనికైనా సమర్థులు..మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు’’ అని ఆయన భావిస్తారు.

స్వాతి: చంద్రబాబు గారు అన్యాయంగా 53 రోజులు జైల్లో ఉన్నారు. ఎప్పుడూ ప్రజలే ప్రాణంగా పనిచేసే ఆయన జైల్లో ఉన్నప్పుడు మీరు ఎలా ధైర్యంగా నిలబడ్డారు? నిజం గెలవాలి అని ఎలా రోడ్డెక్కి పోరాటం చేశారు?

జవాబు: చంద్రబాబుగారు ఏనాడూ కుటుంబం గురించి ఆలోచించిన వ్యక్తి కాదు. మా కుటుంబ సభ్యులం ఏనాడూ చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యాలయాలకు గాని, సెక్రటేరియట్ కు గాని వచ్చినవాళ్లం కాదు. చంద్రబాబుగారు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో అక్రమ కేసు పెట్టి, 53 రోజులు జైల్లో నిర్బంధించారు. రాష్ట్ర యువత కోసం, రాష్ట్ర భవిష్యత్తుకోసం నిలబడిన నా భర్తను వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసింది. 

చంద్రబాబుగారు తప్పుచేయలేదు అని సమాజానికి అర్థమయ్యేలా చేయాలని నేను 'నిజం గెలవాలి' అనే పోరాటానికి శ్రీకారం చుట్టాను. నేను ధైర్యంగా రోడ్డుమీదకు వచ్చి పోరాడానంటే అది నా తండ్రి ఎన్టీఆర్, నా భర్త చంద్రబాబాగారి నుండి పొందిన స్ఫూర్తే. నేను ఒక్కదాన్ని రోడ్డుమీదకు వస్తే...నాకు తోడుగా రాష్ట్రంలోని మహిళలంతా రోడ్డుమీదకు వచ్చి పోరాడారు... నిజాన్ని గెలిపించారు.

వరలక్ష్మి:- చంద్రబాబు గారు ఇంట్లొ ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు....డైనింగ్ టేబుల్ మీద కలిసి భోజనం చేస్తున్నప్పుడు మీతో ఏ ఏ అంశాలు చర్చిస్తారు. ఆయన ఆలోచనలు, చర్చలు ఎలా ఉంటాయి.

జవాబు: చంద్రబాబుగారు ఇంట్లో మాతో కలిసి భోజనం చేసే సమయంలో మా గురించి, మా బాగోగులు గురించి ఏనాడైనా మాట్లాడతారేమో అని అనుకుంటాం. కానీ ఆయన మహిళలకు ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది? మహిళలకు ఏ రంగంలో ఏ అవకాశం ఇస్తే బాగుంటుంది? ఏ పథకం పెడితే మహిళలకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది? యువతకు ఇంకా ఎలాంటి అవకాశాలు, ఉద్యోగాలు, కంపెనీలు, టెక్నాలజీ తీసుకురావాలి? అనే అంశాలే మా డైనింగ్ టేబుల్ మీద చర్చకు వస్తాయి. నేను కూడా మహిళల అభివృద్ధి కోసం నాకు తోచిన సలహాలు, నా ఆలోచనలు నా భర్తతో పంచుకుంటాను. రానున్న ఎన్నికల తర్వాత మహిళల భవిష్యత్తు మరో కొత్త మలుపులు తిప్పాలని చంద్రబాబుగారు మంచి మంచి ప్లానింగులతో రెడీగా ఉన్నారు. ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకుని మీ భవిష్యత్తును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది.

సౌజన్య, విద్యార్థిని, కళాకారిణి:-
చంద్రబాబు సీఎం అయ్యాక శాస్త్రీయ నృత్యాన్ని ఎలా ముందుకు తీసుకెళతారు? ఎలా ప్రోత్సహిస్తారు?

సమాధానం: నేను కూచిపూడి నృత్యాన్ని 11 సంవత్సరాలు నేర్చుకున్నాను. వెంపటి చినసత్యంగారు నా గురువు. నా తండ్రి నాకు 2 సంవత్సరాలు భరతనాట్యం కూడా నేర్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూచిపూడి కళాక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళతారు. చంద్రబాబు అమలు చేయగలిగిన హామీనే ఇస్తారు. హామీ ఇస్తే నెరవేరుస్తారు.

More Telugu News