Nagababu: జగన్ ను పరోక్షంగా విమర్శిస్తూ... పిట్టకథ చెప్పిన నాగబాబు

  • విమానాలు తుడిచేవాడు విమానం నడిపిన కథ చెప్పిన నాగబాబు
  • విమానం అయినా, అధికారం అయినా అనుభవం లేకుండా ఎక్కితే సర్వనాశనం తప్పదని వ్యాఖ్య
  • నడపడం అంటే బటన్ నొక్కడమే కాదని ఎద్దేవా
Nagbabu tells a story

ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ... జనసేన నేత నాగబాబు ఒక పిట్టకథను ఎక్స్ వేదికగా చెప్పారు. ఈ రోజు మీతో ఒక పిట్టకథను పంచుకోవాలనిపించిందని ఆయన అన్నారు. 

నాగబాబు చెప్పిన పిట్టికథ ఇదే... 

"ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు. అలా తుడుస్తున్నప్పుడు కాక్ పిట్ లో, 'విమానం నడపడం ఎలా?' అన్న పుస్తకం కనపడింది. అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు. మొదటి పేజీలో 'విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి' అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది. అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు. విమానం కదలాలంటే 'పచ్చ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నొక్కి చూశాడు. విమానం కదిలింది. అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు. 'విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది. 

అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు. 'విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరంజ్ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది. యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు. 'విమానం కిందకు దిగాలంటే 'ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ' కొనండి' అని ఉంది." అంటూ నాగబాబు కథ చెప్పారు. 

ఇందులో నీతి  ఏంటంటే... విమానం అయినా... అధికారం అయినా... ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే... సర్వ నాశనం కాక తప్పదు అని నాగబాబు అన్నారు. నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు... సమర్ధత అనుభవం కూడా ఉండాలి అని ఎద్దేవా చేశారు.

More Telugu News