Pawan Kalyan: కర్నూలు ‘ఈనాడు’ ఆఫీస్‌పై దాడి ఘటనపై పవన్‌ కల్యాణ్ స్పందన

  • ‘నిన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్.. నేడు ఈనాడు కార్యాలయంపై దాడి అప్రజాస్వామికం’ అని జనసేనాని వ్యాఖ్య
  • ప్రజాస్వామ్యవాదులు ఈ హింసను ఖండించాలని పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్
  • వైసీపీ సర్కార్‌ వైఫల్యాలు, అవినీతిని బయటకు తీసుకొస్తున్నారనే దాడులని మండిపాటు
Pawan Kalyan condemn the attack on Eenadu office in Kurnool

కర్నూలులో ‘ఈనాడు’ ఆఫీస్‌పై జరిగిన దాడిని రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు. ఇప్పటికే నారా చంద్రబాబు, నారా లోకేశ్, వైఎస్ షర్మిలతో పాటు పలువురు నాయకులు ఈ ఘటనను తప్పుబట్టగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేందుకే వైసీపీ దాడులని పవన్ అన్నారు. ‘నిన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్.. నేడు ఈనాడు కార్యాలయంపై దాడి అప్రజాస్వామికం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.  

రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా వైసీపీ మూకలు చేసిన దాడి ఆ పార్టీ వాళ్ల హింసా ప్రవృత్తిని వెల్లడించిందంటూ పవన్ వ్యాఖ్యానించారు. తాజాగా ‘ఈనాడు’పై అదే పంథాను ప్రదర్శించారని, ప్రజాస్వామ్యవాదులు ఈ హింసను ఖండించాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. వైసీపీ సర్కార్‌ వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటకు తీసుకువస్తున్నారనే అక్కసుతో పాత్రికేయుల మీద, మీడియా కార్యాలయాలపైన దాడులు చేస్తున్నారని, ఇది అప్రజాస్వామికమని మండిపడ్డారు. కర్నూలు నగరంలోని ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడటం గర్హనీయమని, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెట్టారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. అంతకుముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించారు.

More Telugu News