Chandrababu: కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి... కేంద్ర హోంమంత్రి, గవర్నర్ లను ట్యాగ్ చేస్తూ చంద్రబాబు ట్వీట్

  • కర్నూలు ఈనాడు  కార్యాలయంపై దాడి
  • తీవ్రంగా ఖండించిన చంద్రబాబు
  • ఓటమి ఖాయమని తేలడంతో జగన్ దాడులకు ప్రేరేపిస్తున్నారని వెల్లడి
Chandrababu condemns attack on Eenadu office in Kurnool

కర్నూలు ఈనాడు కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు తన స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన ట్వీట్ కు కేంద్ర హోంమంత్రిని, రాష్ట్ర గవర్నర్ ను ట్యాగ్ చేశారు. 

అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుల దాడి గర్హనీయమని చంద్రబాబు పేర్కొన్నారు. కొన్నిరోజుల కిందటే ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై అటవిక దాడి జరిగిందని, అతడు తీవ్ర గాయాలపాలయ్యాడని... ఆ కోవలోనే నేడు కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. 

"వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని తేలడంతో జగన్ తన అనుచరులను రెచ్చగొట్టి మీడియాపైనా, విపక్ష పార్టీల కార్యకర్తలపైనా దాడులకు పురిగొల్పుతున్నారు. వీటిని హింసాత్మక చర్యలు అనండి, లేక ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం అనండి... రాష్ట్రంలో మరో 50 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించేందుకు చివరి ప్రయత్నంగానే ఈ దాడులు చేస్తున్నారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. గతంలో ఇలా ఎన్నడూ లేదు" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

More Telugu News