Sonia Gandhi: రాజ్యసభ సభ్యురాలిగా సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక

  • తొలిసారి రాజ్యసభకు వెళుతున్న సోనియా గాంధీ
  • రాజస్థాన్ కోటాలో ఎన్నిక
  • ప్రకటన చేసిన రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి
Sonia Gandhi unanimously elected for Rajya Sabha

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాజ్యసభ సభ్యురాలిగా సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె రాజస్థాన్ కోటాలో రాజ్యసభ బరిలో నిలిచారు. సోనియా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. 

రాజస్థాన్ లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో నోటిఫికేషన్ జారీ చేశారు. మన్మోహన్ సింగ్ (కాంగ్రెస్), భూపేంద్ర యాదవ్ (బీజేపీ)ల పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుండగా... బీజేపీ సభ్యుడు కిరోడి లాల్ మీనా ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

ఈ మూడు స్థానాలకు సోనియా గాంధీ, చున్నీలాల్ గరాసియా (బీజేపీ), మదన్ రాథోడ్ (బీజేపీ) బరిలో నిలవగా... ఇతరులెవరూ పోటీచేయకపోవడంతో ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. 

సోనియా 1999 (అమేథి/బళ్లారి), 2004 (రాయ్ బరేలీ), 2006 (రాయ్ బరేలీ), 2009 (రాయ్ బరేలీ), 2014 (రాయ్ బరేలీ), 2019 (రాయ్ బరేలీ)లో లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు మొదటిసారిగా పెద్దల సభలో కాలుమోపనున్నారు.

More Telugu News