జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి కోర్టుకు హాజరైన కోడికత్తి శ్రీను

  • శ్రీనుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  • ఎన్ఐఏ ఇన్ఛార్జ్ కోర్టులో విచారణకు హాజరైన శ్రీను
  • ఎన్నికలకు ముందే కేసు క్లోజ్ అయ్యేలా ప్రయత్నిస్తామన్న శ్రీను తరపు న్యాయవాది
విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. పలు షరతులతో బెయిల్ ఇచ్చింది. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కేసు విచారణలో భాగంగా శ్రీను తొలిసారి కోర్టుకు హాజరయ్యాడు. ఎన్ఐఏ కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో ఎన్ఐఏ ఇన్ఛార్జ్ కోర్టులో విచారణ జరిగింది. కేసు తదుపరి విచారణను ఎన్ఐఏ ఇన్ఛార్జ్ కోర్టు ఏప్రిల్ 19కి వాయిదా వేసింది. 

ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక నాయకుడు బూసి వెంకట్రావు మాట్లాడుతూ... సీఎం జగన్ ప్రతిసారి ఏదో కారణం చెప్పి కోర్టుకు హాజరు కావడం లేదని విమర్శించారు. ఈ దాడిలో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ సైతం ఇప్పటికే తేల్చి చెప్పిందని అన్నారు. అయినా కోర్టు ఎందుకు వాదనలు కొనసాగిస్తోందో అర్థం కావడం లేదని చెప్పారు. జగన్ ను కాపాడాలని చూస్తున్నారేమో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు.  

శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీమ్ మాట్లాడుతూ... జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తే 90 శాతం కేసు క్లోజ్ అవుతుందని అన్నారు. ఎన్నికలకు ముందే కేసు క్లోజ్ అయ్యేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ కేసులో పాలు ఏవో, నీళ్లు ఏవో తేలుస్తామని చెప్పారు.


More Telugu News

Kodi Kathi Case Sreenu Court YS Jagan Andhra Pradesh