Jasprit Bumrah: రాంచీ టెస్టుకు బుమ్రా దూరం.. ఆ స్థానాన్ని భర్తీచేసే బౌలర్ అతడేనా?

  • ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బుమ్రాకు రెస్ట్
  • ఇంగ్లండ్‌తో చివరి టెస్టుకు తిరిగి అందుబాటులోకి
  • 20 రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్న వైస్ కెప్టెన్
  • బుమ్రా స్థానంలో ముకేశ్ కుమార్?
Team India Star Bowler Jasprit Bumrah To Be Rested For Ranchi Test Against England

టీమిండియా స్టార్ బౌలర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో తర్వాతి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా నిన్న ముగిసిన రాజ్‌కోట్ టెస్టులో భారీ విజయం సాధించిన ఇండియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గాయం కారణంగా 11 నెలలపాటు జట్టుకు దూరమైన బుమ్రా ఇటీవలే టెస్టు జట్టులోకి వచ్చాడు. రాజ్‌కోట్ టెస్ట్‌లో విశ్రాంతి తీసుకోవాల్సిన బుమ్రా రాంచీ టెస్టు నుంచి బ్రేక్ తీసుకోనున్నాడు. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బుమ్రాకు విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ నిర్ణయించింది. 

ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరగనున్న చివరి టెస్టుకు మాత్రం బుమ్రా అందుబాటులో ఉంటాడు. అప్పటి వరకు అంటే దాదాపు 20 రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. రాంచీ టెస్టులో కనుక ఇంగ్లండ్ విజయం సాధిస్తే అప్పుడు ధర్మశాల టెస్టు కీలకంగా మారుతుంది. బుమ్రా ఈ సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలోను కలిపి 80కిపైగా ఓవర్లు వేశాడు. బుమ్రా స్థానంలో ముకేశ్ కుమార్ కానీ, పిచ్‌ అనుకూలతను బట్టి నాలుగో స్పిన్నర్‌ను కానీ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

మూడో టెస్టుకు ముందు రంజీ ట్రోఫీ కోసం ముకేశ్ కుమార్‌ను జట్టు నుంచి రిలీజ్ చేశారు. బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించిన ముకేశ్ కుమార్ బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసుకోగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు.

More Telugu News