Kesineni Chinni: చంద్రబాబుకు నాని తీరని ద్రోహం చేశారు: కేశినేని చిన్ని

  • చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంలో నాని కోవర్టుగా పనిచేశారన్న చిన్ని
  • బాబు అరెస్ట్ సమయంలో లోకేశ్ ఎవరెవరిని కలిశారన్న విషయాలను  జగన్‌కు చేరవేశారని ఆగ్రహం
  • ఎన్నికల తర్వాత నాని ప్రజా జీవితంలో ఉండరని జోస్యం
Kesineni Chinni Fires On Brother Kesineni Nani

కేశినేని నానిపై ఆయన సోదరుడు, టీడీపీ పార్లమెంటు ఇన్‌చార్జి కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండుసార్లు ఎంపీగా గెలిపించిన చంద్రబాబుకు నాని తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంలో కోవర్టులా వ్యవహరించారని, అన్ని విషయాలను జగన్‌కు చేరవేశారని ఆరోపించారు. విజయవాడలో నిన్న విలేకరుల సమావేశంలో చిన్ని మాట్లాడుతూ.. బాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు లోకేశ్ ఎవరెవరిని కలుస్తున్నారు? ఏమేం మాట్లాడుకుంటున్నారన్న విషయాలను జగన్‌కు నాని చేరవేశారని పేర్కొన్నారు. విజయవాడ కోర్టు లోపల జరిగిన పరిణామాలను కూడా ఆయన జగన్‌కు చేరవేశారని, దీంతో పోలీస్ కమిషనర్ టీడీపీ లాయర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారని గుర్తు చేశారు.

ఎన్టీఆర్ జిల్లాలో టికెట్లు ఇప్పిస్తానని పలువురి నుంచి నాని కోట్ల రూపాయలు వసూలు చేశారని, వాటిని తిరిగి ఇవ్వకపోతే బాగుండదని హెచ్చరించారు. మైలవరం టికెట్ ఇప్పిస్తానని మరో ఇద్దరి నుంచి కూడా డబ్బులు వసూలు చేశారని, ప్రాణ స్నేహితుడి వద్ద కూడా డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించారు. విజయవాడ ఎంపీగా టీడీపీలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు వైసీపీలో జగన్ పాలేరుగా మారారని ఎద్దేవా చేశారు. తనను పిట్టల దొర అన్న నాని పరిస్థితి ఏంటో ఎన్నికల తర్వాత తేలిపోతుందని చెప్పారు. వైసీపీ ఆయనకు విజయవాడ సీటు కూడా ఇవ్వదన్నారు. ఎన్నికల తర్వాత కేశినేని నాని అనే వ్యక్తి ప్రజా జీవితంలో ఉండరని జోస్యం చెప్పారు.

More Telugu News