cotton candy: క్యాన్సర్ కారక రసాయనాలు... పీచు మిఠాయి విక్రయాలను నిషేధించిన తమిళనాడు ప్రభుత్వం

  • పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు చెన్నైలో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ విభాగం
  • అధ్యయనంలో రోడమైన్-బి అనే రసాయనాన్ని గుర్తించిన అధికారులు
  • కృత్రిమ రంగు కోసం పీచు మిఠాయిలో దీనిని వినియోగిస్తున్నట్లు గుర్తింపు
Cotton candy banned in Tamil Nadu

పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో వాటి విక్రయాలను రాష్ట్రంలో నిషేధించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ శనివారం వెల్లడించారు. పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు ఇటీవల ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు చెన్నైలో తనిఖీలు నిర్వహించారు. ఈ నమూనాల అధ్యయనంలో రోడమైన్-బి అనే రసాయనాన్ని గుర్తించారు. కృత్రిమ రంగు కోసం పీచు మిఠాయిలో దీనిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

రోడమైన్-బీని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. బట్టల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లలో దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. ఫుడ్ కలర్ కోసం దీనిని ఉపయోగించే అవకాశం లేదు. ఎందుకంటే దీని వల్ల దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఈ రసాయనం శరీరంలోకి వెళితే కిడ్నీ, లివర్ పైన ప్రభావం చూపుతుందని, అల్సర్‌తో పాటు క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు గుర్తించారు. ఈ క్రమంలో పీచు మిఠాయిలలో దీనిని ఉపయోగిస్తున్నందున వీటి అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.

More Telugu News