పుట్టపర్తి సాయిబాబా చనిపోయినప్పుడు డబ్బు మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరారెడ్డి: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి
- రఘువీరా ఒక పొలిటికల్ బ్రోకర్ అన్న పెద్దిరెడ్డి
- కాంగ్రెస్ ను చంపింది రఘువీరా, కిరణ్ కుమార్ రెడ్డి అని వ్యాఖ్య
- తన గురించి రఘువీరాకు ఏం తెలుసని ప్రశ్న
పుట్టపర్తి సత్యసాయిబాబా చనిపోయినప్పుడు ఆయన పార్థివదేహాన్ని తరలించకుండా డబ్బు మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరా అని పెద్దిరెడ్డి అన్నారు. రఘువీరా ఒక పొలిటికల్ బ్రోకర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను బతికించింది తామే అని చెప్పుకుంటున్నారని.. వాస్తవానికి కాంగ్రెస్ ను చంపింది రఘువీరా, కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో రఘువీరా, కిరణ్ కుమార్ రెడ్డిలాంటి ముఠాలు చాలా ఉన్నాయని పెద్దిరెడ్డి అన్నారు. తన గురించి రఘువీరాకు ఏం తెలుసని ప్రశ్నించారు. తమ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి కూడా తన నియోజకవర్గంలో రఘువీరా పర్యటించలేదని చెప్పారు. తాను ఖూనీలు చేశానని రఘువీరా నిరూపిస్తే... రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తాను ఇది చేశానని చెప్పుకునే దిక్కు కూడా చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలవాలని సవాల్ విసిరారు.