Free Food: ఏడాదికి రూ.43 లక్షల వేతనంతో జాబ్ ఆఫర్ చేస్తే.. ‘ఫ్రీ ఫుడ్’ పెట్టే కంపెనీల కోసం ఎంక్వైరీ చేస్తున్న యువకుడు

  • జిమ్‌కు వెళ్లే వ్యక్తి కావడంతో ఉచితంగా ఆహారం పెట్టే కంపెనీల కోసం వెతుకులాట
  • ‘గ్రేప్‌వైన్’ వేదికగా కెరియర్ గురించి షేర్ చేసుకోవడంతో వెలుగులోకి ఓ యువకుడి స్టోరీ
  • స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన గ్రేప్‌వైన్ వ్యవస్థాపకుడు సౌమిల్ త్రిపాఠి
Man offered With Rs43 Lakh Package but he is Seeking for Companies With Free Food

సంవత్సరానికి రూ.43.5 లక్షల వేతనంతో ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి దాదాపు ఆర్థిక సమస్యలు ఉండవు. కానీ ఓ యువకుడు మాత్రం నాలుగు పూటల ఉచిత ఆహారాన్ని పెట్టే మెరుగైన కంపెనీల కోసం అన్వేషిస్తున్నాడు. వ్యక్తులు వారి కెరియర్ల గురించి చర్చించే ప్లాట్‌ఫామ్ ‘గ్రేప్‌వైన్’ వేదికగా తనకు ఎలాంటి ఉద్యోగం కావాలో సదరు యువకుడు క్లారిటీగా చెప్పడంతో ఈ విషయం బయటపడింది. కెరియర్‌పై అతడికి ఉన్న క్లారిటీ సోషల్ మీడియా యూజర్లను మాత్రమే కాకుండా గ్రేప్‌వైన్‌ వ్యవస్థాపకుడు సౌమిల్ త్రిపాఠిని కూడా విపరీతంగా ఆకర్షించింది. దీంతో సదరు యువకుడి స్క్రీన్‌షాట్‌ను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. 

ఉచితంగా ఆహారాన్ని అందించే కంపెనీల కోసం యువకుడు అన్వేషిస్తున్నట్టుగా స్క్రీన్‌షాట్‌ను బట్టి స్పష్టమవుతోంది.  4.5 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉన్న సదరు యువకుడు తాను జిమ్‌కు వెళ్లే వ్యక్తినని, నెలవారీ ఆహార ఖర్చులు ఎక్కువగా ఉంటాయని పర్కొన్నారు. అందుకే నాలుగు పూటల ఉచితంగా ఆహారాన్ని స్పాన్సర్ చేసే కంపెనీల కోసం అన్వేషిస్తున్నట్టు పేర్కొన్నాడు. మంచి ప్రొటీన్ ఫుడ్ అందించే కంపెనీల్లో చేరడంపై ఆలోచిస్తున్నానని,  గూగుల్ ఇంటర్వ్యూలకు వెళ్లడం మొదలుపెట్టానని పేర్కొన్నాడు. ‘‘నేను టార్గెట్ చేయాల్సిన ఇతర కంపెనీలు ఏమైనా ఉన్నాయా?’’ అని కోరారు.

సౌమిల్ త్రిపాఠి ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఈ స్క్రీన్‌షాట్ వైరల్‌గా మారింది. ‘‘ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ఎంపికల గురించి స్పష్టత ఉన్న వ్యక్తులను నేను చాలా అరుదుగా చూస్తుంటాను. తదుపరి ఉద్యోగం పొందడానికి మంచి ఆహారం లభ్యతే అతడి ప్రాధాన్యత’’ అని త్రిపాఠి పేర్కొన్నారు. ఈ పోస్టుపై చాలా మంది నెటిజన్లు స్పందించారు. అతడు జొమాటోలో చేరాలి.. వారే చక్కగా చూసుకుంటారని కొందరు ఫన్నీ సలహా ఇచ్చారు. ఇక అంత పెద్ద జీతంతో ఆహారం పొందలేకపోవడం ఏంటో అర్థం కావడంలేదని కొందరు కామెంట్ చేశారు.

More Telugu News