Nara Lokesh: జగన్ ఒక అవినీతి స్టార్: విజయనగరంలో నారా లోకేశ్

  • విజయనగరంలో లోకేశ్ శంఖారావం
  • జగన్ ఏ స్కీమ్ తెచ్చినా కుట్ర ఉంటుందని విమర్శలు
  • అమరావతి రైతులను ఇబ్బంది పెట్టాడని వెల్లడి
  • వైవీ ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అంటున్నారని ఆగ్రహం
Nara Lokesh termed CM Jagan a corruption star

టీడీపీ యువనేత నారా లోకేశ్ విజయనగరంలో శంఖారావం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఒక ప్యాలెస్ పిల్లి అని ఎద్దేవా చేశారు. 

రాజధాని పేరుతో ఎన్నో జే టర్న్ లు తీసుకున్నారని విమర్శించారు. నాడు చంద్రబాబు పిలుపుతో అమరావతి రైతులు రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చారని, కానీ మూడు రాజధానులు అంటూ అమరావతి రైతులను జగన్ ఇబ్బందిపెట్టాడని అన్నారు. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్ రాజధానిగా ఉండాలని అంటున్నారని లోకేశ్ మండిపడ్డారు. 

యువతకు ఉద్యోగాలు ఇస్తానని జగన్ మోసం చేశాడని, యువతకు దొరక్కుండా పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. "జగన్ ఒక అవినీతి స్టార్. ఆయన ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాని వెనుక కుట్ర ఉంటుంది. ఇళ్ల స్థలాల్లో శంకుస్థాపనల పేరిట రూ.2 వేల కోట్లు కొట్టేశాడు. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తిచేస్తామన్న హామీ ఏమైంది?" అని నిలదీశారు. 

ప్రశ్నించిన టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని, చంద్రబాబు నిప్పులా బతికిన వ్యక్తి అని లోకేశ్ స్పష్టం చేశారు. చంద్రబాబును చూస్తే అద్భుతమైన పరిశ్రమలు గుర్తొస్తాయని వివరించారు. జగన్ ను చూస్తే బూమ్ బూమ్ బ్రాండ్లు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. 

వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ-జనసేన కూటమేనని, తాము అధికారంలోకి వస్తే ఏటా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.

More Telugu News