Sarfaraz Khan: అరంగేట్ర మ్యాచ్‌లో రనౌట్ కావడంపై తొలిసారి స్పందించిన సర్ఫరాజ్ ఖాన్

  • కొన్నిసార్లు ఆటగాళ్ల మధ్య ‘మిస్ కమ్యూనికేషన్’ జరుగుతుందన్న యువ బ్యాటర్
  • ఆటలో ఇది ఒక భాగమేనని వ్యాఖ్య
  • రాజ్‌కోట్ టెస్టులో వ్యక్తిగత స్కోరు 62 పరుగులకు రనౌట్ అయిన సర్ఫరాజ్ ఖాన్
Sarfaraz Khan reacts to being run out in the debut match

రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌ ద్వారా యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 48 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ వ్యక్తిగత స్కోరు 62 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. దీంతో అరంగేట్ర మ్యాచ్‌లోనే రనౌట్ అయిన అతికొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో తనూ చేరాడు. ఈ పరిణామంతో సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. 

సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ అవ్వడానికి మరో ఎండ్‌లో ఉన్న రవీంద్ర జడేజానే కారణమంటూ సోషల్ మీడియాలో చర్చ కూడా నడిచింది. అయితే దీనిపై సర్ఫరాజ్ ఖాన్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఆటగాళ్ల మధ్య కొన్నిసార్లు ‘మిస్ కమ్యూనికేషన్’ జరుగుతుందని, ఇది ఆటలో ఒక భాగమని అన్నాడు. ఇలాంటివి ఆటలో సహజమేనని పేర్కొన్నాడు.

 ఈ మేరకు మొదటి రోజు ఆట ముగింపు సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ వివరణ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా తనకు అన్ని విధాలా సహకరించాడని చెప్పాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అవతలి ఎండ్‌లో బ్యాటర్‌తో మాట్లాడాన్ని తాను ఇష్టపడతానని, ఇదే విషయాన్ని జడేజాకు చెప్పానని, దీంతో తనతో మాట్లాడుతూ జడేజా బ్యాటింగ్ చేశాడని వివరించాడు. జడేజా బాగా మద్దతు ఇచ్చాడని అన్నాడు. అరంగేట్ర ఆటగాళ్లు ఎలా భావిస్తుంటారో, ఎలా ఆడాలో జడేజా తనకు చెప్పాడని అన్నాడు. ముఖ్యంగా తాను మొదటి స్వీప్ ఆడినప్పుడు బంతి మిస్ అయ్యిందని, కొంచెం టైమ్ తీసుకోమని జడేజా సలహా ఇచ్చాడని సర్ఫరాజ్ ఖాన్ వెల్లడించాడు. జడేజా సూచనను పాటించానని వివరించాడు.

More Telugu News