palla rajeswar reddy: సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం

  • కడియం శ్రీహరిపై కోమటిరెడ్డి అనుచిత భాషను ఉపయోగించారని.. రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్
  • కడియం ఎక్కడా బడ్జెట్‌కు సంబంధం లేని విషయాలు మాట్లాడలేదని వ్యాఖ్య
  • సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చిన భాష మాట్లాడి తెలంగాణ భాషగా చెప్పుకుంటున్నారని ఆగ్రహం
Palla Rajeswar Reddy fires at CM Revanth Reddy and Komatireddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీనియర్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు కడియం శ్రీహరిపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన అనుచిత భాషను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కడియం చాలా సీనియర్ ఎమ్మెల్యే అనీ, ఎక్కడా బడ్జెట్‌కు సంబంధం లేని విషయాలు మాట్లాడలేదన్నారు. కానీ కోమటిరెడ్డి మాట్లాడిన తీరు సరికాదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దానిని తెలంగాణ భాషగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. మన తెలంగాణ భాషను ముఖ్యమంత్రి అవమానపరుస్తున్నారని, సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణతో రాజీవ్ గాంధీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. అక్కడ కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్నారు. రెండు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందన్నారు. అసెంబ్లీలో కంచెల పాలన తెచ్చారని... మా గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు.

More Telugu News