Modi In UAE: దుబాయ్‌లో వరల్డ్ గవర్న్‌మెంట్స్ సమ్మిట్.. బుర్జ్ ఖలీఫాపై మువ్వన్నెల వెలుగులు

  • యూఏఈలో వరల్డ్ గవర్న్‌మెంట్స్ సమ్మిట్
  • సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం దుబాయ్‌కు చేరుకున్న ప్రధాని
  • మోదీకి యూఏఈ అధ్యక్షుడి ఘన స్వాగతం
  • బుర్జ్ ఖలీఫాపై మువ్వన్నెల కాంతులతో భారత జాతీయ పతాకం ఆవిష్కరణ
PM Modi In UAE Burj Khalifa Lights Up With Guest Of Honor Republic Of India

వరల్డ్ గవర్న్‌మెంట్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు మంగళవారం దుబాయ్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ఈ సమావేశాల్లో గౌరవ అతిథిగా పాల్గొంటున్న మోదీకి యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్ సాదర స్వాగతం పలికారు. ఇరు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. 2015 నుంచి ఇప్పటివరకూ మోదీకి ఇది ఏడో యూఏఈ పర్యటన.

కాగా, దుబాయ్ యువరాజు షేఖ్ హమ్దాన్ ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ కూడా మోదీకి సాదర స్వాగతం పలికారు. ఇరు దేశాల బంధం అంతర్జాతీయ సహకారానికి ఓ మంచి ఉదాహరణ అని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. 

ప్రధాని మోదీ గౌరవార్థం యూఏఈ ప్రభుత్వం బుర్జ్ ఖలిఫా ఆకాశహర్మ్యంపై కాంతివెలుగులతో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా దుబాయ్ యువరాజు ప్రధాని మోదీకి స్వాగతం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ సమావేశంలో మోదీ ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు.

రెండు రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్న ప్రధాని మోదీ అబుదాబిలోని బీఏపీఎస్ మందిరాన్ని కూడా ప్రారంభిస్తారు. ముంగళవారం మోదీ.. యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల నేతలు పలు అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఫారిన్ సెక్రెటరీ వినయ్ క్వాత్రా కూడా పాల్గొన్నారు.

More Telugu News