Nara Lokesh: మీ బిడ్డను కదా మీ భూమి నాకు ఇచ్చేయండంటూ జగన్ గుంజుకుంటాడు: పాతపట్నంలో నారా లోకేశ్

  • పాతపట్నంలో శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం
  • ఎన్నికల ముందు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నాడంటూ జగన్ పై ఫైర్
  • ఇది నిరుద్యోగులను మభ్యపెట్టడమేనని విమర్శ  
  • సొంత చెల్లెళ్లకే రక్షణ కల్పించలేని సీఎం రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించగలడా అంటూ ప్రశ్న
Nara Lokesh Speech At Pathapatnam Shanakaravam Sabha

బాంబులకే భయపడని కుటుంబం మాది, మీ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడతామా.. అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భయం తమ బయోడేటాలోనే లేదని చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెడితే టీడీపీ శ్రేణులు అధైర్యపడతారని జగన్ భావించాడని అన్నారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును 53 రోజులు జైలుకు పంపించారు.. లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ జైలుకు వెళ్లే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. ఈమేరకు మంగళవారం ఉత్తరాంధ్రలోని పాతపట్నంలో జరిగిన శంఖారావం సభలో నారా లోకేశ్ మాట్లాడారు.

శ్రీకాకుళం జిల్లా ప్రజల రక్తంలోనే పౌరుషం ఉందన్నారు. మంచి చేసిన వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని, అన్యాయం చేసిన వారిని ఇక్కడే పాతిపెడతారని.. ఆ శక్తి కేవలం శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మాత్రమే ఉందని మెచ్చుకున్నారు. జగన్ అంటే ఓ ప్రిజనరీ.. చంద్రబాబు అంటే విజనరీ అంటూ నారా లోకేశ్ చెప్పారు. జగన్ ను చూస్తే ఓ ఖైదీ గుర్తుకొస్తాడని, చంద్రబాబును చూస్తే విజన్ ఉన్న నాయకుడు కనిపిస్తాడని అన్నారు. ఇటీవల జగన్ మీబిడ్డ మీబిడ్డ అని అంటున్నాడని చెబుతూ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడంటే.. పొరపాటున మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే నేను మీ బిడ్డను కదా మీ భూమి నాకు ఇచ్చేయండంటూ జగన్ గుంజుకుంటాడని లోకేశ్ చెప్పారు.

ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్.. ఐదేళ్లూ ఆ విషయమే పట్టించుకోకుండా తీరా ఎన్నికల ముందు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నాడని చెప్పారు. ఇది నిరుద్యోగులను మభ్యపెట్టడమేనని చెబుతూ మోసపోవద్దంటూ నిరుద్యోగులను లోకేశ్ హెచ్చరించారు. లక్షల్లో ఖర్చు చేసి కోచింగ్ లు తీసుకుని జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత కష్టాలు తనకు తెలుసని అన్నారు. ఒక్క రెండు నెలలు ఓపిక పడితే టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసినపుడు 200 కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వం ఆరోపించిందని లోకేశ్ గుర్తుచేశారు. ఆ తర్వాత అది 275 కోట్లకు, నిన్న కాక మొన్న కేవలం 27 కోట్ల అవినీతి అంటూ అధికారులు చెబుతున్నారని ఆరోపించారు. ‘మీ ప్రభుత్వ అవినీతి, మా చిత్తశుద్ధి’ పై చర్చకు ఎప్పుడైనా సరే సిద్ధమని నారా లోకేశ్ చెప్పారు. టైము డేటు ఫిక్స్ చేసి చెప్పాలంటూ జగన్ కు సవాల్ విసిరారు.

‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ పలుచోట్ల బోర్డులు కనిపిస్తున్నాయని నారా లోకేశ్ చెప్పారు. ఆ బోర్డుల్లో ఎవరెవరో కనిపిస్తున్నారని అంటూ.. ‘మీ అమ్మ, మీ చెల్లెలే మిమ్మల్ని నమ్మలేదు.. మమ్మల్నెలా నమ్మమంటావు’ అంటూ జగన్ ను ప్రశ్నించారు. ఎన్నికల ముందు అమ్మను, చెల్లెను వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లిద్దరినీ మెడబట్టి బయటకు పంపించాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ సొంత చెల్లెలు షర్మిలతో పాటు వైఎస్ సునీత తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చిందని గుర్తుచేశారు. ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ కల్పించలేని ఈ ముఖ్యమంత్రి మనకు రక్షణ కల్పిస్తాడా? అనేది ఇక్కడున్న మహిళలు ఆలోచించాలని లోకేశ్ చెప్పారు. జగన్ పాలనపై సొంత కుటుంబ సభ్యులు విమర్శలు చేసినా వైసీపీ పేటీఎం కుక్కలు మొరుగుతున్నాయని, నీచంగా విమర్శలు చేస్తున్నారని లోకేశ్ వివరించారు.

More Telugu News