Sundar Pichai: గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఉదయాన్నే ఏం చదువుతారంటే..!

  • ఉదయాన్నే టెక్ మీమ్ వెబ్ సైట్ చదువుతానన్న సుందర్ పిచాయ్
  • వెబ్ సెర్చ్ విధానం మారిపోతోందన్న పిచాయ్
  • జెమినీ ఏఐ చాట్ బాట్ ను తీసుకొస్తున్నామని వెల్లడి
What Google CEO Sundar Pichai reads in the morning

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చదవడంతో తన రోజువారీ దినచర్యను ప్రారంభిస్తారు. అయితే ఆయన ఉదయమే చదివేది ఏ వార్తాపత్రికో లేదా పుస్తకమో కాదు. టెక్ మీమ్ అనే వెబ్ సైట్ ను ఆయన ఉదయమే ఓపెన్ చేస్తారు. అందులో ఉన్న అప్ డేట్స్ ను ఆయన చదువుతారు. ఈ వెబ్ సైట్ ను ఫాలో అయ్యే వారిలో మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకెర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తదితర టెక్ దిగ్గజాలు కూడా ఉన్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరీ కూడా వీరి జాబితాలో చేరారు. 

వైర్డ్ తో ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలోని లేటెస్ట్ గ్లోబల్ టెక్ వార్తలను 'టెక్ మీమ్' అందిస్తుందని తెలిపారు. ఒరిజినల్ ఆర్టికల్స్ కు సంబంధించిన హెడ్ లైన్లను, వాటి లింక్స్ ను ఈ వెబ్ సైట్ అందిస్తుంది. వివిధ ఔట్ లెట్ల ద్వారా టెక్ వార్తలను ఈ వెబ్ సైట్ యూజర్లకు అందుబాటులో ఉంచుతుంది. టెక్ రంగంలోని డెవలప్ మెంట్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. టెక్ మీమ్ ను 2005లో గాబే రివేరా స్థాపించారు. టెక్ రంగంపై ఆసక్తి ఉన్న వారికి ఇదొక ప్రాధాన్య వెబ్ సైట్ అని చెప్పొచ్చు. 

ఇదిలావుంచితే, వెబ్ సెర్చ్ విధానం మారిపోతోందని సుందర్ పిచాయ్ చెప్పారు. భవిష్యత్ అవసరాల కోసం దీన్ని మరింతగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికోసం తాము 'జెమినీ' అనే ఏఐ చాట్ బాట్ ను తీసుకొస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తాము అందుబాటులోకి తీసుకొచ్చిన 'బార్డ్' పేరును మార్చి దీన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇది త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైళ్లలో యాప్ ల రూపంలో రానుందని తెలిపారు. 

ఇతర సంస్థల ఏఐ అసిస్టెంట్లతో పోలిస్తే జెమినీ చాలా భిన్నమైనదని సుందర్ పిచాయ్ చెప్పారు. తమ మోడల్ లో కేవలం టెక్స్ట్ రూపంలో మాత్రమే కాకుండా ఆడియో, వీడియో, ఫొటోలు, కోడ్... ఇలా రకరకాల డేటా ఫార్మాట్లు ఉంటాయని చెప్పారు. ఏ రూపంలో ఆదేశాలిచ్చినా స్పందిస్తుందని తెలిపారు. ఇలాంటి సాంకేతికతను గూగుల్ కు అనుసంధానించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని... ఇందులో భాగంగానే గూగుల్ లెన్స్ వంటి ఫీచర్లు తీసుకొచ్చామని.... జెమినీతో ఇప్పుడు తమ లక్ష్యం పూర్తిగా నెరవేరబోతోందని చెప్పారు.

More Telugu News