Nara Lokesh: కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ లా జగన్ వ్యవహారం: నారా లోకేశ్

  • రూ.10 ఖాతాలో వేసి రూ.100 లాగేస్తున్నాడని ఆరోపణ
  • నరసన్నపేట శంఖారావం సభలో జగన్ పై విమర్శలు
  • ఒకరి ఇంట్లో చెత్త మరొకరి ఇంట్లో బంగారం అవుతుందా..?
  • ఎమ్మెల్యేల నియోజకవర్గ బదిలీలపై లోకేశ్ వ్యంగ్యం
Nara Lokesh Speech At Narasaraopet Shankaravam Sabha

ముఖ్యమంత్రి జగన్ వ్యవహారం ఓ కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ లా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. సంక్షేమ పథకాల పేరుతో రూ.10 ప్రజల ఖాతాల్లో వేసి తిరిగి వారి నుంచి రూ.100 లాగేసుకుంటున్నాడని విమర్శించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని గత ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన మాటలు నమ్మి జనం ఓట్లు వేసి 31 మంది వైసీపీ ఎంపీలను గెలిపించగా.. ఇప్పుడేమో తనపై ఉన్న కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు తలవంచుతున్నాడని లోకేశ్ ఆరోపించారు. ఈమేరకు సోమవారం నరసన్నపేట శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగించారు.

ఉత్తరాంధ్ర అంటే విప్లవ్లానికి మారుపేరని, శ్రీకాకుళం అంటే సింహమని లోకేశ్ పేర్కొన్నారు. సభకు హాజరైన ప్రజలను ఉద్దేశిస్తూ.. ఇక్కడున్న మీరంతా సింహాల్లా కన్పిస్తున్నారని అన్నారు. రెండు నెలల్లో తాడేపల్లి గేట్లు పగలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోందని చెప్పారు. జగన్ పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని గుర్తుచేశారు. ఎంపీలు ఆయనకు ముఖం చాటేస్తున్నారని, వారంతా బైబై జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు.

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చిన జగన్.. తీరా సీఎం కుర్చీలో కూర్చున్నాక జీపీఎస్ తీసుకొచ్చాడని లోకేశ్ మండిపడ్డారు. ఆయన నిర్వాకంతో ఉద్యోగులు కూడా బైబై జగన్ అంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్యేల ట్రాన్స్ ఫర్ అనే కొత్త పథకం అమలవుతోందని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఒకరి ఇంట్లోని చెత్త ఇంకోచోట బంగారం అవుతుందా? ఇక్కడ పనికిరానివారు పక్క నియోజకవర్గంలో ఎలా పనికొస్తారు.. అంటూ నిలదీశారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ.. బాబాయ్ ని చంపింది ఎవరని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చంద్రబాబే చంపించాడని ప్రచారం చేశారు, ఇప్పుడేమో జగన్ తమ్ముడు (అవినాశ్ రెడ్డి) పేరు పోలీసుల చార్జిషీట్ లో నమోదైందని గుర్తుచేశారు. రేపోమాపో జగన్ పేరు కూడా ఆ జాబితాలో చేరుతుందని, జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలో మద్యం తయారుచేసేది, అమ్మేది కూడా జగన్ అని లోకేశ్ ఆరోపించారు. ప్రతీ క్వార్టర్ పై జే ట్యాక్స్ పేరుతో రూ. 25 వసూలు చేసి జేబులో వేసుకుంటున్నారని జగన్ పై మండిపడ్డారు. ఏటా రూ.9 వేల కోట్ల చొప్పున జగన్ ఈ ఐదేళ్లలో రూ.45 వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు.

గాలి పైనా పన్నులేసే రకం..
కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనం జేబులు గుల్ల చేస్తున్నారని, అవకాశమిస్తే గాలిపైన కూడా జగన్ పన్ను వసూలు చేసే రకమని నారా లోకేశ్ ఆరోపించారు. టీడీపీ గెలిస్తే సంక్షేమ పథకాలు నిలిపేస్తారంటూ వాలంటీర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి సంక్షేమాన్ని పరిచయం చేసిందే ఎన్టీఆర్ అని, చంద్రబాబు దానిని కొనసాగించారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన పలు కార్యక్రమాలను జగన్ ఆపేశారని చెప్పారు. ఎన్నికలకు ఇంకా 60 రోజులే ఉందని గుర్తుచేస్తూ.. ప్రజల్లో తిరగాలని కేడర్ కు లోకేశ్ సూచించారు. పార్టీ కార్యక్రమాలను, సూపర్ -6 కిట్ ద్వారా గడపగడపకూ తిరుగుతూ టీడీపీ విజయానికి కృషి చేసే కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. తన చుట్టూ, పార్టీ ఆఫీసు చుట్టూ కాకుండా ప్రజల్లో తిరగాలని చెప్పారు. 

వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమే..
రాష్ట్రంలో వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి టీడీపీపై ప్రజలకున్న అభిమానం చూశానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పాలన అందిస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకు నెలనెలా రూ. 3 వేలు భృతి అందిస్తామని అన్నారు. ప్రతీ ఇంటికీ ఏటా మూడు ఉచిత సిలిండర్లు, 18 నుంచి 59 ఏళ్ల మహిళలు, యువతులకు నెలనెలా రూ.1,500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని లోకేశ్ వివరించారు. స్కూలుకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటా రూ.15 వేలు ఇస్తామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తామని హామీ ఇచ్చారు.

ఉత్తరాంధ్రకు పట్టిన శని..
ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు పట్టిన శని అంటూ నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల పేరుతో విశాఖను నాశనం చేసి, రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారని మండిపడ్డారు. రైల్వే జోన్ కు భూమి కేటాయించలేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ ప్రయత్నాన్ని టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పందికొక్కుల్లా దోచుకుతింటున్నారని మండిపడ్డారు. 

పెండింగ్ లోనే ప్రాజెక్టులు..
వంశధార, తోటపల్లి, నాగావళి ప్రాజెక్టుల పెండింగ్  పనులు ఎక్కడవి అక్కడే ఉన్నాయని లోకేశ్ గుర్తుచేశారు. మూతబడిన చక్కెర కర్మాగారాల ఊసే ఎత్తడం లేదన్నారు. ధర్మాన కృష్ణదాస్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గానికి ఆయన చేసింది శూన్యం.. పేరులో ధర్మాన ఉందిగానీ ఆయన చేసే పనులన్నీ అధర్మమే అని విమర్శించారు. అంగన్ వాడీ పోస్టులు, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా అమ్ముకుంటున్నారని, సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారని చెప్పారు. ఎర్రన్నాయుడు పేరుతో పార్క్ నిర్మిస్తే జేసీబీతో ధ్వంసం చేశారని గుర్తుచేశారు. టీడీపీ కార్యకర్త షాపింగ్ కాంప్లెక్స్ ను కూల్చేశారని చెప్పారు. 

కార్యకర్తలే టీడీపీ బలం..
నరసన్నపేట నియోజకవర్గానికి రూ.1200 కోట్లు ఖర్చు పెట్టి టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని లోకేశ్ చెప్పారు. ఉద్దానం కిడ్నీ పేషంట్లకు డయాలసిస్ ఏర్పాటు, గ్రామాలకు తాగునీరు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వంటి ఎన్నో పనులు చేశామన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. శ్రీముఖలింగ ఆలయం అభివృద్ధి బాధ్యత తాను వ్యక్తిగతంగా తీసుకుంటానని చెప్పారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, వారి సంక్షేమం కోసం నిధి ఏర్పాటు చేశామని లోకేశ్ గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించినా వెనక్కి తగ్గకుండా, పసుపు జెండాను వీడకుండా పనిచేస్తున్న కార్యకర్తలు అందరికీ ఈ సందర్భంగా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.

చంద్రబాబు నిప్పు..
నిప్పులా బతుకుతున్న చంద్రబాబుపైనా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని గుర్తుచేశారు. చంద్రబాబుపై చేసిన అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమని, చర్చకు వచ్చే ధైర్యం ఉందా అంటూ జగన్ కు సవాల్ విసిరారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేస్తే పవన్ మనకు అండగా నిలబడ్డారని, హలో ఏపీ - బైబై వైసీపీ అని పవనన్న పిలుపునిచ్చారని చెప్పారు. టీడీపీ జనసేన పొత్తు విషయంలో ఎటువంటి అపోహలకు తావులేకుండా ఇరుపార్టీల కార్యకర్తలు ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలని లోకేశ్ పిలుపునిచ్చారు.

More Telugu News