Greyhounds: పొరపాటున ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పట్టుకుని గ్రేహౌండ్స్ కమాండో మృతి.. సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం

  • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఘటన
  • అటవీ జంతువుల నుంచి రక్షణ కోసం పంటల చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్
  • ములుగు జిల్లా గోవిందరావుపేటలో ఫెన్సింగ్ తగిలి యువకుడి మృతి
Greyhounds commando die of electric shock in  Nasthurpalle forests Telangana

గ్రేహౌండ్స్ కమాండో ఒకరు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. నస్తూర్‌పల్లెలో కూంబింగ్ ఆపరేషన్‌లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ ఐరన్ ఫెన్సింగ్‌ను పట్టుకున్న కమాండో ఎ.ప్రవీణ్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. 

అటవీ జంతువుల నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు సమీప ప్రాంతాల రైతులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కరెంటు వైరుతో రక్షణ ఏర్పాటు చేయడం సర్వ సాధారణం. ఇప్పుడిదే కమాండో ప్రాణాలు బలిగొంది. అడవిలో కొందరు అనుమానితులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న గ్రౌహౌండ్స్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ప్రవీణ్ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.  

ఎలక్ట్రిక్ కంచె ఏర్పాటు చేసిన గ్రామస్థులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రవీణ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. కాగా, ములుగు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. గోవిందరావుపేటలో రమేశ్ (28) అనే వ్యక్తి ఎలక్ట్రిక్ ఫెన్సింగును ముట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

More Telugu News