Harish Rao: తెలంగాణ బడ్జెట్ చెత్తగా ఉందన్న హరీశ్ రావు

  • కొండంత ఆశలు చూపి గోరంత బడ్జెట్ కూడా ఇవ్వలేదన్న హరీశ్
  • రైతుల విషయంలో మొండి చేయి చూపించారని విమర్శ
  • రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల ఉచిత కరెంట్ రావడం లేదని మండిపాటు
Harish Rao fires on TS budget

తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశ పరిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బడ్జెట్ చెత్తగా ఉందని చెప్పారు. కొండంత ఆశలు చూపి గోరంత బడ్జెట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. రైతు భరోసా, వ్యవసాయ బీమాకు నిధులు ఇవ్వలేదని అన్నారు. రైతుల విషయంలో మొండి చేయి చూపించారని చెప్పారు. అన్నదాతలను ఆగం చేసేలా బడ్జెట్ ఉందని విమర్శించారు. రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ గురికాక తప్పదని అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన అనంతరం మీడియా పాయింట్ వద్ద హరీశ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సమయంలో అబద్ధాలు చెప్పారని... ఇప్పుడు అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెపుతున్నారని హరీశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల ఉచిత కరెంట్ రావట్లేదని... సబ్ స్టేషన్లకు వెళ్లి లాగ్ బుక్ లు చూద్దాం రండి అని సవాల్ విసిరారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని బడ్జెట్ లో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలు మాత్రమే అమలయ్యాయని... మిగిలిన 11 హామీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 

వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని... లేకపోతే నిరుద్యోగుల నుంచి నిరసన తప్పదని హరీశ్ హెచ్చరించారు. గృహజ్యోతి నుంచి ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే రూ. 8 వేల కోట్లు కావాలని... కానీ బడ్జెట్ లో రూ. 2 వేల కోట్లు మాత్రమే పెట్టారని విమర్శించారు. ఆటో కార్మికులకు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేవని చెప్పారు.

More Telugu News