Pawan Kalyan: పొత్తులపై వ్యతిరేక వ్యాఖ్యలొద్దు... తమ పార్టీ నేతలకు స్పష్టం చేసిన పవన్ కల్యాణ్

  • ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్న జనసేన
  • పార్టీ విధానాలకు భిన్నంగా పొత్తులపై వ్యాఖ్యలు చేయవద్దన్న పవన్ కల్యాణ్
  • పార్టీ నేతలు భావోద్వేగ ప్రకటనలు చేయవద్దని సూచన
Pawan Kalyan orders Janasena leaders do not go against Party stand on alliance

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పొత్తులపై జనసైనికులకు హితోపదేశం చేశారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులు అని పేర్కొన్నారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దు అని స్పష్టం చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 

"జన హితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జనసేన పార్టీ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నాం. 

ప్రస్తుతం పొత్తులకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్న ఈ దశలో జనసేన పార్టీ నేతలు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయవద్దు. ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారవుతారు. 

ఇందుకు సంబంధించిన అభిప్రాయాలు, సలహాలు ఏవైనా ఉంటే నా రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావొచ్చు. తద్వారా మీ ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి చేరతాయి. పార్టీ విధానాలకు భిన్నంగా పొత్తులపై ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి స్పష్టత ఇచ్చాను. 

పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించకమానరు. ప్రజలు స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండడం అవసరం" అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News