Mallareddy University: మల్లారెడ్డి వర్సిటీ ముందు ఉద్రిక్తత.. విద్యార్థుల ఆందోళన

  • విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నారంటూ ధర్నా
  • స్టూడెంట్స్ అనారోగ్యం పాలైతే దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
  • విద్యార్థుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జాం
Student protest over food contamination in mallareddy university in Hyderabad

హైదరాబాద్‌ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ముందు విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా విద్యార్థులకు యూనివర్సిటీలో నాణ్యతలేని ఆహారం పెడుతూ అనారోగ్యం పాలు చేస్తున్నారంటూ స్టూడెంట్ యూనియన్లు ఆందోళనకు దిగాయి. కాలేజ్ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి సమాధానం చెప్పాలని ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు, విద్యార్థులు ధర్నాకు దిగారు. దీంతో, రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

హాస్టర్ విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు ఉంటున్నాయని చెబుతున్నా పట్టించుకోవట్లేదని విద్యార్థులు, స్టూడెంట్ యూనియన్ సభ్యులు మండిపడ్డారు. ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేడీస్ హాస్టల్‌లో మగవాళ్లను సెక్యూరిటీ గార్డులుగా పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న మల్లారెడ్డి యూనివర్సటీ యాజమాన్యం నాణ్యమైన విద్య, భోజనం, అందించకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురైతే విషయం బయటకు రాకుండా దాస్తున్నారని ఆరోపించారు. 

వర్సిటీ హాస్టల్‌లో ఫిబ్రవరి 7న రాత్రి భోజనంలో బొద్దింక, బల్లి పడి విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని ఆందోళనకు దిగారు. ఈ విషయమై గురువారం కూడా విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. అప్పటి నుంచీ వర్సిటీ ముందు ఆందోళనలు కొనసాగుతున్నాయి.

More Telugu News