Road Accident: నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి లారీ, బస్సును ఢీకొట్టిన మరో లారీ.. ఆరుగురి దుర్మరణం

  • కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద ఘటన
  • మరో 15మందికి తీవ్ర గాయాలు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
4 dead and 15 injured in road accident held in Nellore district

నెల్లూరు జిల్లాలో గత అర్ధరాత్రి దాటాక జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆగి వున్న లారీని వెనక నుంచి మరో లారీ బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఆ లారీ ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. 

బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. లారీ ఢీకొనడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే చనిపోయిన ఆరుగురి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News