PV Narasimha Rao: తండ్రికి భారతరత్న రావడంపై పీవీ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి స్పందన

  • పి.వి.కి భారతరత్న ఇవ్వడం ప్రధాని మోదీ సంస్కారానికి నిదర్శనమని వ్యాఖ్య
  • తన తండ్రికి భారతరత్న ఇవ్వడంతో ఆ పురస్కారానికే విలువ పెరిగిందన్న సురభి వాణీదేవి
  • తరతరాలకూ సరిపోయే సంస్కరణలను పి.వి. నరసింహారావు తీసుకు వచ్చారన్న కూతురు
PV daughter on bharat ratna to his father

దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఈ ప్రకటనపై పి.వి. కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ... పి.వి.కి భారతరత్న ఇవ్వడం ప్రధాని నరేంద్ర మోదీ సంస్కారానికి నిదర్శనమన్నారు. పార్టీలకు అతీతంగా పి.వి. సేవలను ప్రధాని మోదీ గుర్తించారని వ్యాఖ్యానించారు. తన తండ్రికి భారతరత్న ఇవ్వడంతో ఆ పురస్కారానికే విలువ పెరిగిందన్నారు.

పి.వి.నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి దేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉందని గుర్తు చేశారు. సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని పి.వి. ఆలోచించారన్నారు. భయం, మొహమాటం లేకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జీవించారని పేర్కొన్నారు. తరతరాలకూ సరిపోయే సంస్కరణలను ఆయన తీసుకు వచ్చారన్నారు. పి.వి.కి భారతరత్న దక్కడంపై కుటుంబ సభ్యులు, తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పి.వి.ని గౌరవించుకోవడమంటే మనల్ని మనం గౌరవించుకోవడమే అన్నారు.

More Telugu News