Crime News: దూరం పెడుతోందని.. పట్టపగలు అందరూ చూస్తుండగానే యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

  • నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్‌లో ఘటన
  • టైలరింగ్ షాపు నుంచి వస్తుండగా కత్తితో దాడిచేసిన నిందితుడు
  • అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితురాలి మేనకోడలికి గాయాలు
Jilted lover stabs woman to death in Nirmal district Khanapur

ప్రియురాలు తనను దూరం పెడుతోందన్న కక్షతో ఓ యువకుడు (27) ఆమెను కత్తితో పొడిచి చంపాడు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణంలో పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. ఈ ఘటనలో బాధితురాలి మేనకోడలు కూడా గాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ, ఆమె మేనకోడలు, మేనల్లుడితో కలిసి నిన్న టైలరింగ్ షాపు నుంచి ఇంటికి తిరిగి వస్తోంది. అదే సమయంలో అక్కడ కాపుకాసిన నిందితుడు ఆమెపై కత్తితో దాడిచేశాడు. విచక్షణ రహితంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె మేనకోడలికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. 

మృతురాలు, నిందితుడు ఒకరికొకరు తెలుసునని పోలీసులు తెలిపారు. ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తుండడంతో ఆమె అతడికి దూరంగా ఉంటోంది. ఆమె తనను దూరం పెడుతుండడాన్ని జీర్ణించుకోలేకపోయిన నిందితుడు కాపుకాసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

More Telugu News